ఆదిబట్ల, డిసెంబర్ 13: తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 32 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. కిడ్నాప్లో పాల్గొన్న మరో నిందితుడు చందును మంగళవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అరెస్ట్ చేశారు. ఐదు రోజులుగా పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రధాన నిందితుడు నవీన్రెడ్డి కోసం ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కోసం నవీన్రెడ్డి వినియోగించిన వోల్వో కారును సోమవారం శంషాబాద్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవీన్రెడ్డి శంషాబాద్ మీదుగా పక్క రాష్ర్టాలకు వెళ్లి తల దాచుకున్నాడన్న పక్కా సమాచారంతో ఆదిబట్ల పోలీసులతోపాటు ఎస్వోటీ, టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం గోవాలో నవీన్రెడ్డిని అదుపులోకి తీసుకుని ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్కు తీసుకువచ్చి బుధవారం అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. కాగా ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి రిమాండ్కు తరలించిన నిందితుల్లో ఐదుగురిపై ఇబ్రహీంపట్నం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. ప్రధాన నిందితుడు పోలీసులకు చిక్కడంతో ఈ ఐదుగురితోపాటు నవీన్రెడ్డిని కూడా పోలీసులు కస్టడీకి తీసుకోనున్నట్టు తెలిసింది.