హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)/శామిర్పేట: రైతులకు సాగుచట్టాలపై అవగాహన పెంచడంతోపాటు ఉచిత న్యాయ సలహాలు అందించాలని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందుకోసం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్)తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థలు కలిసి గ్రామీణ యువతకు వ్యవసాయ చట్టాలపై శిక్షణ ఇవ్వనున్నాయి. సాగు చట్టాలపై అవగాహన, సాగు న్యాయ శిబిరాలు వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నాయి.
ఈ సందర్భంగా లీఫ్స్ వ్యవస్థాపకుడు భూమి సునీల్ మాట్లాడుతూ.. రైతుకు దుకి దున్నే దగ్గరనుంచి పంటను అమ్ముకొనే వరకు నిత్యం చట్టాలతో అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 200లకు పైగా సాగుచట్టాలు ఉన్నాయని చెప్పారు. వీటిపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించాల్సిన అవసరం రోజురోజుకూ పెరుగుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయ సేవలను అందించేందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, లీఫ్స్ చేతులు కలిపాయని చెప్పారు. కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షుడు జీవన్, నల్సార్ అధ్యాపకులు డాక్టర్ బాలకృష్ణ, మల్లికార్జున్, రీసెర్చ్ అసోసియేట్స్ శివచరణ్, జ్యోతి, న్యాయవాది మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.