హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఇంటి నుంచి తప్పిపోయిన, కర్మాగారాలు, హోటళ్లలో బాలకార్మికులుగా మగ్గుతున్న చిన్నారుల జీవితాల్లో తిరిగి నవ్వులు తెప్పించే ఉద్దేశంతో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,174 మంది చిన్నారుల జాడను కనిపెట్టారు. ఆపరేషన్ ముస్కాన్-7లో భాగంగా తెలంగాణ పోలీసుశాఖకు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు ఇతర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. చిన్నారులను అక్రమంగా నిర్బంధించిన, వారితో పనులు చేయిస్తున్న 442 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు.