హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): తనను ప్రశ్నించొద్దని, ప్రశ్నలు అడిగితే మాట్లాడబోనని మీడియా ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని స్పష్టంచేశారు. రాష్ట్రలో నూరుశాతం వెబ్కాస్టింగ్తో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతున్నదని, సాయంత్రం వరకు పోలింగ్శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరుగుతున్న పోలింగ్ సరళిని బుధవారం మధ్యాహ్నం వెబ్కాస్టింగ్ ద్వారా ఆమె తన కార్యాలయం నుంచి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని, పండుగ వాతావరణంలో పోలింగ్ జరుగుతున్నదని చెప్పారు. అభివృద్ధికి ఓటు అనేది కీలకమని, ఓటర్లు అందరూ ఓటు హకును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. యువ ఓటర్లు ఎకువగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రలో చాలాచోట్ల అధికార పార్టీ నేతలు బహిరంగంగా నగదు పంచుతున్నారన్న వీడియోలు బయటకు వచ్చాయని, ఎవరిపైనైనా కేసులు నమోదయ్యాయా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించిన కమిషనర్ ఆ తర్వాత మౌనం వహించారు.
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ద్వారా ఓటర్లను గుర్తిస్తున్నామని, ఇప్పటివరకు 55% మ్యాపింగ్ పూర్తయిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచడానికి తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఏసీగార్డ్స్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వెబ్ కాస్టింగ్ వల్ల ఎన్నికల్లో నిర్వహణ, ఓట్ల కౌంటింగ్లోనూ పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ఎకడ ఎలాంటి ఇబ్బంది అయినా వెబ్ కాస్టింగ్ వల్ల తమకు వెంటనే తెలుస్తుందని చెప్పారు.
పోలింగ్ బూత్లలో ఎకడా ఘర్షణలు జరగడం లేదని సీడీఎంఏ కమిషనర్ టీకే శ్రీదేవి తెలిపారు. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లో మొదటిసారి మంచి ఓటు శాతం నమోదు అవుతున్నదని తెలిపారు. ఓటింగ్ శాతం పెరుగడం అంటే సక్సెస్ అన్నట్టేనని పేర్కొన్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ సాగుతున్నదని తెలిపారు.
మున్సిపల్ పోలింగ్ సందర్భంగా నల్లగొండ, కరీంనగర్ కార్పొరేషన్లలో తలెత్తినవి చిన్నపాటి గొడవలేనని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టంచేశారు. పోలింగ్కు ఎలాంటి సమస్యలు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన డీజీపీ.. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఎవరైనా ప్రచారం చేస్తే స్టేషన్కు తరలిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారమే వెళ్తామని, అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని పేర్కొన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని తెలిపారు.