హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ను నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఇటీవల ఎన్నికల కమిషనర్తో ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) ఉన్నతాధికారులు రహస్యంగా భేటీ కావడాన్ని ఆయన శనివారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు. పీఎంవో తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని, ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. భారతదేశ ఎన్నికల కమిషన్కు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, దాని పనితీరును ప్ర పంచ దేశాలు అనేక సందర్భాల్లో ప్రశంసించాయని గుర్తుచేశారు. గొప్ప నేపథ్యం ఉన్న ఎన్నికల కమిషన్ ను మోదీ ప్రభుత్వం తమ కనుసన్నల్లో పెట్టుకోవాల ని చూడటం ప్రజాస్వామ్యానికి విఘాతమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలపై ప్రతిఒక్కరూ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈసీ విధుల్లో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం మానుకోవాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతుందని హెచ్చరించారు.