మోర్తాడ్, జూలై 13: ‘ఇదిగో మీరడిగిన రక్తం.. నాతోపాటు బాల్కొండ రైతుల రక్తాన్ని మీకు పంపిస్తున్నాం. వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలి’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్హౌస్ వద్ద సోమవారం వేముల తనతోపాటు రైతుల రక్తాన్ని సేకరించి వినూత్న నిరసన చేపట్టారు. ‘వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయి’ అని రేవంత్రెడ్డి రాక్షసంగా మాట్లాడారని, ముఖ్యమంత్రి అడిగినట్టుగానే తనతోపాటు బాల్కొండ రైతులు రక్తాన్ని ఇస్తున్నామని, ఇప్పుడైనా పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
‘నా రక్తం తీసుకోండి.. రైతులకు మాత్రం నీళ్లివ్వండి’ అంటూ సవాల్ విసిరారు. అనంతరం రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నదని, వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లను ప్రారంభించి, ఆ నీటిని ఎల్లంపల్లికి తీసుకొచ్చి అక్కడి నుంచి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ఉన్నదని సూచించారు. వరద కాలువపై కేసీఆర్ కట్టిన రాంపూర్, రాజేశ్వర్రావుపేట్, ముప్కాల్ పంప్హౌస్లు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు ఉన్నదని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసరాల కోసం వెంటనే 4 టీఎంసీలను విడుదల చేయాలని వేముల కోరారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.