హైదరాబాద్ : వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వసూళ్లు, దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సీఎం స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) కాంగ్రెస్పై మండిపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గర్పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను(Crops) పరిశీలించి మాట్లాడారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేలకు సోయలేదన్నారు. రెండు తడులు నీళ్లు అందిస్తే పంటలు గట్టెక్కేవి, కానీ, జిల్లా మంత్రులకు ఆ ఆలోచన లేదన్నారు. రైస్ మిల్లర్లను, క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
జిల్లా మంత్రులు ఇసుక దందాలో తలమునకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రభుత్వ పరంగా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.