వరుణ దేవుడు శాంతించి, వర్షాలు తగ్గాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కోరుకున్నారు. కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి హోమంలో ఆయన పాల్గొని, పూజలు చేశారు. అనంతరం ఈ నెల 17వ తేదీన మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను మగ్గంపై ప్రారంభించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని 91 దేవాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వారంనుంచి కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. గోదావరి నది గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నదని పేర్కొన్నారు.
వరుణ దేవుడు శాంతించాలని కోరుతూ వరుణ శాంతి హోమం నిర్వహించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేసిందన్నారు. 3,500 దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ నెల 17 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు నిర్వహించనున్న నేపథ్యంలో 91 దేవాలయాలకు రూ. 76 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ నెల 24 వ తేదీన బోనాలు నిర్వహించనున్న హైదరాబాద్ పరిధిలోని దేవాలయాలకు ఈ నెల 18 వ తేదీన చెక్కుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వివరించారు. మహంకాళి ఆలయానికి వెళ్లే రెండు ప్రధాన రహదారుల్లో నిర్మించిన ఆర్చ్లను 15 వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఈ సుదర్శన్, ఎలక్ట్రికల్ డీఈ శ్రీధర్, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, బల్కంపేట, మహంకాళి ఆలయాల ఈవోలు అన్నపూర్ణ, మనోహర్రెడ్డి, ట్రస్టీ కామేశ్, కార్పొరేటర్లు సుచిత్ర, మహేశ్వరి, హేమలత, దీపిక, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణగౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, తదితరులు పాల్గొన్నారు.