హైదరాబాద్ : ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే బీఆర్ఎస్ (BRS) పార్టీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. మంగళవారం సాయంత్రం టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్తో కలిసి పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా సభా వేదిక ఏర్పాటు, సభా ప్రాంగణంలోకి వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అదేవిధంగా నగరంలోని 24 నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్ కోసం 24 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, తదితరులు ఉన్నారు.