వనపర్తి : గుడుంబా, గంజాయిని నిర్మూలించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడుంబా, గంజాయిపై ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. వనపర్తి జిల్లా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల గుండా రాష్ట్రానికి గంజాయి అక్రమణ రవాణా చేసే, సహకరించే వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు.
జిల్లాలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారికి రైతుబంధును రద్దు చేస్తామన్నారు. పోలీస్ శాఖ అధికారులతో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని గంజాయి రవాణా, సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో గుడుంబా నిర్ములనలో భాగంగా 256 మందికి పునరావాసం పథకం కింద బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధిని కల్పించామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సహాయ కమిషనర్ దత్తరాజు గౌడ్, ఇన్చార్జి ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సైదులు, సీఐలు పాల్గొన్నారు.