ఖిల్లాఘణపురం, నవంబర్ 16 : ఐదేండ్లు బీఆర్ఎస్(BRS) వెంట ఉండి.. ఎమ్మెల్యే టికెట్ కోసం నమ్మకద్రోహం(traitors )చేసి ఇతర పార్టీలకు వెళ్లిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోవడంతో బతుకుదెరువు కోసం వలస వెళ్లి జీవనం సాగించేవారన్నారు.
నేడు కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో పెండింగ్, రన్నింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడంతో బీడుభూములన్నీ పచ్చని మాగాణుల్లా మారాయన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాను కృష్ణానీటితో తడిపామన్నారు. పైరవీలకు తావులేకుండా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు నేరుగా చేరుతున్నాయని పేర్కొన్నారు.
ఆయా గ్రామాల్లో పింఛన్లు రాలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆన్లైన్లో వివరాలు నమోదయ్యాయని.. ఎన్నికలు పూర్తయ్యాక పింఛన్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలను, రాష్ర్టాన్ని గాలికొదిలేస్తారని హెచ్చరించారు. ప్రజలు అడిగినా అడగకపోయినా తన దృష్టికి వచ్చిన ప్రతి పనిని చేసి చూపించానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.