హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రపంచానికి ఆహారం రావాల్సింది వ్యవసాయం నుంచేనని, ఈ రంగంపై ప్రభుత్వాల దృక్పథం ఇకనైనా మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన విత్తనాల ద్వారానే దిగుబడి పెరుగుతుందని, వివిధ పంటరకాల విస్తరణకు పరిశోధనలు ముఖ్యమని నొక్కిచెప్పారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం నోవాటెల్లో ఏర్పాటుచేసిన జాతీయ విత్తన సదస్సుకు మంత్రి నిరంజన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయరంగ పరిశోధనలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొనసాగుతున్నా, అవి మరింత సమన్వయంతో ముందుకుసాగాల్సిన అవసరముందని అన్నారు.
ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని, నాణ్యమైన పోషకాహారంపై దృష్టిపెట్టాల్సి ఉందని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. నాణ్యమైన ఆహార ఉత్పత్తులు రావాలంటే.. నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉందని అన్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తిదారుల్లో భారత్ ముందున్నదని, దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. కరోనా సమయంలో విత్తన ఉత్పత్తి, విత్తన పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను దేశం అంతా అనుసరించిందని గుర్తుచేశారు.
తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేదని చెప్పారు. ఆ సమస్యను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ దేశంలో తొలిసారి నకిలీ విత్తనాల విక్రేతలపై పీడీ యాక్ట్ ప్రవేశపెట్టారని చెప్పారు. విత్తన సదస్సులో విక్రేతలు, పరిశోధకులు, ఉత్పత్తిదారులు, పరిశ్రమ వర్గాలు లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. విత్తన పరిశ్రమ ఎదురొంటున్న సమస్యల పరిషారానికి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ విత్తన రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సా హం దేశంలో మరే రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ మోటర్లకు ఉచిత కరెంటు, కోటి ఎకరాలకు సాగునీరు, సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని వివరించారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మాట్లాడుతూ తెలంగాణ సీడ్ హబ్గా ఎదిగిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో పోషకాహారం, ఆహార భద్రత పెద్ద సవాలని, దానిని అధిగమించాలంటే నాణ్యమైన విత్తన పరిశోధనలో ఎంతో కృషి చేయాలని సదస్సులో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఐకార్ సీడ్స్ డీజీ డాక్టర్ డీకే యాదవ్, తెలంగాణ సీడ్స్ ఎండీ కేశవులు, ఎన్ఎస్ఏఐ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, ఇస్టా వైస్ ప్రెసిడెంట్ ఎర్నెస్ట్ అల్లెన్, ఉల్రెక్ మిల్లర్, ఎఫ్ఎస్ఐఐ వైస్ ప్రెసిడెంట్ పరేశ్ వర్మ, కేంద్ర ప్రభుత్వ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ కమీషనర్ దిలీప్ కుమార్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.