హైదరాబాద్ : బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఆ పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివరి రోజున అమెరికాలోని టీఆర్ఎస్ విభాగం న్యూజెర్సీలోని కన్వెన్షన్ సెంటర్లో మీట్అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం విభాగం లేవనెత్తిన పలు సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేకుండాపోయిందన్నారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. యావత్ భారత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు.
అందుకు ఆయన ఎనిమిదేండ్లుగా అందించిన అభివృద్ధి నమూనానే కారణమన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ వైస్ ప్రెసిడెంట్ గొంగిడి మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డితో పాటు పాటు టీఆర్ఎస్ అమెరికా విభాగం నేతలు గంగోని శ్రీనివాస్, అనిల్ ఎర్రబెల్లి, హరిందర్ తల్లాబెల్లి, టోనీ జన్ను, పొగాకు మహేశ్, అరవింద్ తక్కెళ్లపల్లి, నవీన్ జలగం, భాస్కర్ పిన్నా తదితరులు పాల్గొన్నారు.