సిరిసిల్ల కలెక్టరేట్, జూన్ 30 : నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినందున మధ్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను వెంటనే పెంచాలని కోరుతూ మిడ్ డే మీల్స్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ధర్నాలకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. మెనూ చార్జీలు పెంచకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడారు.
ఒకటో తరగతి నుంచి ఐదోతరగతి వరకు ఒకో విద్యార్థికి రూ.6.50, ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు రూ.10 మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తున్నదని, ఈ మొత్తంతో రెండు కూరలు, నాణ్యమైన భోజనం అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మారెట్లో వంటనూనె, పప్పులు, చింతపండు, టమాట, మిర్చి, ఇతర నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయని, కానీ మెనూ చార్జీలు మాత్రం ఏండ్లుగా పెంచలేదని విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జూలై 10వ తేదీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ క్యాంపు కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, మర్రి విజయ, బీ రెడ్డి లక్ష్మి, జ్యోతి, ఎండీ జుబేదా, నర్సవ్వ, రేఖ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.