పురాతన కాలంనాటి శివలింగాలు లభ్యం
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కొండపాకలో మరోసారి పురాతనకాలంనాటి సూక్ష్మరాతి పనిముట్లు, దేవతామూర్తుల విగ్రహాలు, శివలింగాలు బయటపడ్డాయి. స్థానిక అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ వ్యవసాయ పొలాల్లో వీటిని కనుగొన్నారు. కొండపాక ప్రాంతం కాకతీయుల శాసనానికి, దేవాలయాలకు ప్రసిద్ధి. కల్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల, ఆరో విక్రమాదిత్యుని రాణి లక్ష్మీదేవి దాన శాసనమున్న మల్లన్నగుట్ట అక్కడే ఉన్నది. ఈ గుట్టకు పడమటవైపు శాతవాహనుల కాలంనాటి పాటిగడ్డ విస్తరించి ఉన్నది. రైతులు చెలకలు దున్నినప్పుడల్లా రాసులకొద్ది రంగురంగుల గాజు పూసలు, టెర్రకోట పూసలు, టెర్రకోట బొమ్మల శకలాలు, కొత్త రాతియుగంనాటి రాతిగొడ్డళ్లు బయటపడుతుంటాయి. గుట్టకు తూర్పున దక్షిణ గంగ అనే వాగు నీటి ప్రవాహంతో ఏర్పడిన కుంట ఉన్నది. ఆ ప్రవాహ మార్గంలో రాతి పనిముట్లు, పూసలు దొరుకుతుంటాయి. కొంతకాలంగా స్థానిక కరుణాకర్, మహేశ్ ఈ ప్రాంతంలో పురాతన వస్తువుల కోసం పరిశోధన చేస్తున్నారు. వారితోపాటు వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్, అరవింద్ ఆర్య, సముద్రాల సునీల్ తదితరులు కొండపాకను సందర్శించి పరిశోధిస్తున్నారు. తాజాగా, పాటిగడ్డ మీద మధ్యరాతి యుగంనాటి సూక్ష్మరాతి పరికరాలు (మైక్రోలిథ్స్) దొరికాయి. ఈ రాతియుగం వయస్సు క్రీ.పూ. 8000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల వరకు ఉంటుందని చరిత్రకారులు చెప్తున్నారు. వాటిలో ప్లింట్ (చెకుముకి) రాయితో చేసిన బాణం ములికి లభించడం విశేషం. కాంచనపల్లి, రత్నాపూర్, హస్తలాపూర్లో కూడా సూక్ష్మరాతి పరికరాలు లభించాయి. వేల సంవత్సరాల కిందట మానవులు ఈ ప్రాంతంలో ఎన్నో ఆవాసాలను ఏర్పరుచుకున్నారని తెలుసుకోవడానికి ఈ రాతి పనిముట్లు ఆధారాలుగా చెప్పవచ్చు. వివిధ ఆకృతులలో కొత్తరాతియుగం గొడ్డళ్లు, శాతవాహనకాలంనాటి డిజైన్లతో ఉన్న కుండ పెంకులు కూడా లభించాయి. కొండపాక శివాలయంలో చాళుక్యుల కాలంనాటి సప్తమాతృకల శిల్పఫలకం గుడిలో ధ్వజస్తంభానికి ఆనించిపెట్టి ఉన్నట్టు, బయటపడేసిన శిల్పాలలో చాళుక్యులకాలంనాటి లింగపీఠాలు, ఒక లింగ పీఠంలో అమర్చిన శివలింగం కూడా లభించినట్టు కరుణాకర్ తెలిపారు.