హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. శనివారం ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా రవాణాశాఖ అధికారులతో కలిసి కేక్ కట్ చేసి, ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్అండ్బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, ప్రత్యే కార్యదర్శి (టీఆర్అండ్బీ) విజేంద్ర బోయి, ఆర్టీఏ అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చే శాఖల్లో రవాణాశాఖ ఒకటని, రాబోయే రోజుల్లో మరింత లక్ష్యం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. రవాణా విభాగంలో ఏ వ్యక్తి కార్యాలయానికి రాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయని, క్రమంగా వినియోగదారుల సేవల్ని మరింత విస్తరించడంతో సీఎం కేసీఆర్ లక్ష్యం త్వరలో నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు అధికారుల, ఉద్యోగుల సహకారంతో పాటు సృజనాత్మక ఆలోచనలు అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 10 నుంచి 12 దాకా ఆన్లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ సమయంలో రవాణా శాఖ ప్రజలకు అందించిన సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మమతా ప్రసాద్, రమేశ్, పాపారావు, పాండురంగ నాయక్, రామచందర్ పాల్గొన్నారు.