హైదరాబాద్/మహబూబ్నగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయస్థాయి గుర్తింపు దకింది. తల్లి పాలను ప్రోత్సహించే దవాఖానలకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్షియేటివ్’ (బీఎఫ్హెచ్ఐ) అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్’ (గ్రేడ్ -1) లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్ను రెండు దఫాలుగా పరిశీలించింది. అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించుకొని అక్రిడిటేషన్ మంజూరు చేశారు. దేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డు సృష్టించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనేందుకు ఇది నిదర్శనంగా నిలిచింది.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఓ వైపు ఎంసీహెచ్లు, ఎన్ఐసీయూలలాంటి సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం ‘బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా’ సహకారంతో 35 మంది మాస్టర్ ట్రెయినీలకు శిక్షణ ఇప్పించింది. వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు దేశంలోనే మొదటిసారిగా ‘వలంటరీ లాక్టేషన్ వరర్స్’ పేరుతో అదనపు సిబ్బందిని నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకత, ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్లో ముగ్గురు వలంటీర్లు పనిచేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రంలో శిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి 4 దవాఖానలకు మాత్రమే బీహెచ్ఎఫ్ఐ అక్రెడిటేషన్ ఉంది. వీటిలో అక్రెడిటేషన్ పొందిన ప్రభుత్వ దవాఖాన ఉన్న రాష్ట్రం తెలంగాణే కావడం విశేషం. రాష్ట్రంలోని మరికొన్ని దవాఖానలు కూడా ఇందుకోసం దరఖాస్తు చేసుకొన్నాయి.
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్స్ టీ హబ్ రాష్ట్రంలోనే తొలి అక్రెడిటేషన్ పొందిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. టీ హబ్కు జాతీయ అక్రెడిటేషన్ లభించిన సందర్భంగా శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆయన కేక్ కట్ చేశారు. వైద్యులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా మహబూబ్నగర్ టీ హబ్లో క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. టీ హబ్లో ఫుల్లీ ఆటోమెటిక్ ఎక్విప్మెంట్తో సుమారు 50కి పైగా పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నేటి వరకు 1,03,730 మంది రోగుల నుంచి 1,72,413 శాంపిల్స్ సేకరించామని వివరించారు. 3,21,777 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 19,15,283 రకాల నివేదికలు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ భాస్కర్, ఆర్ఎంవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడ మాతా శిశు దవాఖానకు ప్రారంభించిన ఏడాదిన్నరలోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ గ్రేడ్ వన్ రావడం హర్షణీయం. ఈ ఘనత సాధించిన బాన్సువాడ ఎంసీహెచ్ భారతదేశంలోనే మొదటి ప్రభు త్వ దవాఖాన కావడం మన రాష్ర్టానికే గర్వకారణం. దవాఖాన సూపరింటెండెంట్, వైద్యులు, నర్సులు, ఆయాలు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి అభినందనలు.
– పోచారం శ్రీనివాస్రెడ్డి,స్పీకర్
బాన్సువాడ ఎంసీహెచ్కు బీఎఫ్హెచ్ఐ అక్రెడిటేషన్ రావడం హర్షణీయం. దవాఖాన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పేందుకు ఇది నిదర్శనం. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ దవాఖానలు జాతీయస్థాయి నాణ్యతా ధ్రువపత్రాలు సాధించాయి. బిడ్డ పుట్టిన అరగంటలో ముర్రుపాలు పట్టించడం, కచ్చితంగా ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే తాగించడం వల్ల శిశు మరణాలు తగ్గుతాయి. పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.
– హరీశ్రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి