ముంబై, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): వ్యవస్థాపక దినోత్సవాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్కు ఝలక్ తగిలింది. ఆ పార్టీ నేత, సావనేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీల్ కేదార్ శాసన సభ్యత్వం రద్దయింది. 21 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన నాగ్పూర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనకు రూ.12.5 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నాగ్పూర్ కోర్టు ఈ నెల 22న తీర్పు చెప్పింది. దీంతో మహారాష్ట్ర శాసన సభ సచివాలయం శనివారం ఆయనను శాసన సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన సునీల్ కాంగ్రెస్ పార్టీలో గట్టి పట్టు ఉన్న నాయకుడు. ఆయన గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. ఈ కేసులో మరో ఐదుగురికి కూడా నాగ్పూర్ కోర్టు శిక్షలు విధించింది.