Kailash Satyarthi | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, బచ్పన్ ఆందోళన్ సంస్థ వ్యవస్థాపకులు కైలాశ్ సత్యార్థి ప్రశంసించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో తెలంగాణ సర్కారు బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేసిన తీరును ఆయన కొనియాడారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మణిపూర్లో జరుగుతున్న హింస సమసిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ముణిపూర్లో జరుగుతున్న అల్లర్లు అక్కడి బాలబాలికలపై తీవ్ర మానసిక ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బాల్య వివాహాలు ఉన్నాయి. ఇది వాస్తవమే. సంప్రదాయ, సాంస్కృతిక వైరుధ్యాలే దీనికి కారణం. పాశ్చాత్య దేశాల్లో యుక్తవయసు విషయంలో వారికి ఉన్న అభిప్రాయాలు వేరు. పాశ్చాత్య దేశాల్లోని కొన్ని సమూహాల్లో 15 ఏండ్లు నిండినవారు కూడా పెండ్లి/లివింగ్ టుగెదర్ పేరుతో కలిసి ఉంటున్నారు. అక్కడి సమాజం దీన్ని అంగీకరిస్తున్నది కూడా. మన సంస్కృతీ, సంప్రదాయాలు, పరిస్థితులు వేరు. అయితే, ఎక్కడైనా సరే అమ్మాయికి 21 ఏండ్లు వస్తేనే పెళ్లి చేయాలన్నది మా నినాదం. వైవాహిక జీవితం పరిపూర్ణం కావాలంటే 21 ఏండ్ల తర్వాతనే పెళ్లి చేయాలి.
మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరి, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ, గడిచిన 20 ఏండ్లుగా బాలకార్మికుల సంఖ్య పెరిగింది. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) గోల్ 8.7లో పెట్టుకున్నదానికి భిన్నంగా జరుగుతున్నది. నాలుగు ఏండ్లలోనే 152 మిలియన్ల నుంచి 162 మిలియన్లకు బాలకార్మికుల సంఖ్య పెరిగింది. ప్రతిరోజూ 10 వేల మంది ఆఫ్రికా పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. ఇది ఏమాత్రం సహేతుకం కాదు.
రాజకీయ పార్టీలు ఏమంటున్నాయన్నదానిపై నేను మాట్లాడలేను. కానీ, మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్షిప్లు, వివాహ ప్రోత్సాహకాలు వంటి పథకాలు ఉండాలి. వీటిని ఉచితాలుగా పేర్కొనలేం. నేను రాజకీయ కోణంలో ఇలా చెప్పడం లేదు. సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలు ఉండాలి. ఇలాంటి పథకాలు నిరుపేదలకు, నిజమైన లబ్ధిదారులకు అందితే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఒక్క మనదేశంలోనే కాదు.. బ్రెజిల్, బంగ్లాదేశ్తోపాటు అనేక దేశాల్లో కూడా సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అవి కూడా లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉన్నది.
మనదేశంలో అద్భుతమైన చట్టాలున్నాయి. కానీ, వాటిని అమలు చేయడంలోనే అసలు సమస్య ఉన్నది. యువతుల వివాహ వయసును 21కి పెంచాలని చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అయితే, ప్రజాచైతన్యం, భాగస్వామ్యం లేకుండా మనం ఏమీ చేయలేం. ప్రపంచంలోని నోబెల్ అవార్డు గ్రహీతలు, ఎన్జీవోలు, ఇతరులు కలిసి ఒక గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ మెకానిజం చేపట్టాలని నిర్ణయించాం. మా స్థాయిలో మేం పనిచేస్తూనే ఉన్నాం.
బాల్య వివాహాలు తగ్గాలంటే ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. ఇందుకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇలాంటి సోషల్ ప్రొటెక్షన్ స్కీంలతో కొంత వరకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధమైన పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిలువరించాలంటే ఈ తరహా సోషల్ ప్రొటెక్షన్ పథకాలు మాత్రమే సరిపోవు. చట్టాన్ని కూడా అమలు చేయాల్సి ఉంటుంది. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు చాలా బాగున్నాయి. ఈ విషయాన్ని నేను అనేక వేదికలపై కూడా చెప్పాను. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మా సంస్థ కూడా భాగస్వామ్యం అయ్యింది. భరోసా కేంద్రాలతో మహిళలకు తోడ్పాటు అందుతున్నది. తెలంగాణ పోలీసులతో కలిసి పనిచేస్తున్నాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒడిశా పిల్లలు ఇటుకబట్టీల్లో పనిచేసేవారు. ‘ఆపరేషన్ ముస్కాన్’ చేపట్టి వారికి విముక్తి కల్పించారు. అలాగే, మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయి.
మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరం. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు. యుద్ధమైనా, జాతుల మధ్య గొడవలైనా జరిగే నష్టం అపారం. మణిపూర్లో జరుగుతున్న పరిణామాల ప్రభావం అక్కడి పిల్లలపై, వారి మానసిక ఆలోచనలపై చాలా తీవ్రంగా ఉంటుంది. అక్కడ శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
నాకు తెలంగాణతో చాలా సుదీర్ఘ పరిచయం ఉన్నది. నేను రంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు రెండు దశాబ్దాలుగా వస్తూనే ఉన్న. హైదరాబాద్ అభివృద్ధి అద్భుతం. ఇక్కడ ఐటీ పరిశ్రమలో యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి లభిస్తున్నది. దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు కొలువయ్యాయి. మంచి పరిణామం.
పోక్సో చట్టం అమలు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని మెచ్చుకోవాలి. దేశంలోని అనేక రాష్ట్రాల కంటే సమర్థవంతంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా పోక్సో కోర్టులను ఏర్పాటు చేశాయి. అయితే, ఆశించినమేరకు ఫలితాలు కనిపించడంలేదన్నది వాస్తవం. తెలంగాణలో జరుగుతున్నట్టు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరగాలి. నేను వరంగల్కు వచ్చి పోక్సో కోర్టులు, ఇక్కడ చట్టం అమలవుతున్న తీరును పరిశీలించాను. చాలా బాగా చేస్తున్నారు. ప్రజా భాగస్వామ్యం ఉంటే పోక్సో తరహా కేసుల్లో నిందితులకు త్వరగా శిక్షలు అమలవుతాయి.