బన్సీలాల్పేట్, డిసెంబర్ 27: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7తో మనకు ముప్పు లేదని, దానిని ఎదుర్కొనే సత్తా మనకు ఉన్నదని, ప్రజలు భయాందోళనకు గురికావద్దని తెలంగాణ వైద్య విద్యాశాఖ డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ కే రమేశ్రెడ్డి చెప్పారు. తప్పనిసరిగా మాస్క్ను ధరించాలని, ఒకేచోట గుంపులుగా గుమిగూడ వద్దని సూచించారు. మంగళవారం గాంధీ దవాఖానలో మాక్డ్రిల్లో భాగంగా సూపరింటెండెంట్, డిప్యూటీ డీఎంఈ డాక్టర్ ఎం రాజారావు, ఆర్ఎంవో డాక్టర్ జయకృష్ణతో కలిసి ఓపీ, ఎమర్జెన్సీ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ సిలిండర్ల విభాగాలను సందర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం సూచన మేరకు కొవిడ్ వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున, ముందస్తుగా ఇక్కడి పరిస్థితులను, చేపట్టిన చర్యలను కొవిడ్ పోర్టల్లో అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. తాము ఆర్టీపీసీఆర్ ల్యాబ్లను తిరిగి ప్రారంభించామని, కొవిడ్ టెస్ట్ల కోసం రీ-ఏజెంట్లను కూడా సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 28 వేల ఆక్సిజన్ బెడ్లు, 1800 వెంటిలేటర్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, సరిపడా వైద్యులు, సిబ్బంది ఉన్నారని, పూర్తిస్థాయిలో మందులు, వైద్య పరికరాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. వ్యాక్సినేషన్ విజయవంతం కావడంతో ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగిందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ వ్యాప్తి నివారణలో సహకరించాలని కోరారు.