జైనూర్ : నేటి రోజుల్లో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెనుభారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి పెళ్లిళ్లకు తిప్పలు పడుతున్న వారందరికీ లెండిజాల గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ( Asifabad District ) జైనూర్ మండలం లెండిజాల గ్రామస్థులు ( Lendijala villagers) తాజాగా గ్రామంలో కట్న, కానుకలను ( Dowry and Gifts ) నిషేదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై గ్రామంలో జరిగే పెళ్లిళ్లలో కట్నాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ బుధవారం లెండిజాల రాయ్ సెంటర్లో సార్మేడి మెస్రం బాధిరావు పటేల్, గ్రామ ముఖ్యుడు మెస్రం పాలక్రావు దేవరి అధ్యక్షతన గ్రామ సమావేశంలో తీర్మానించారు. పెళ్లిళ్లలో కట్నాలు, కానుకల పేరుతో కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా గ్రామంలో ఎవరి కుటుంబంలో పెళ్లి శుభాకార్యం జరిగినా ఊరు మొత్తం కలిసి సహకరించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకోసం ప్రతి కుటుంబం రూ.400 చొప్పున చందా రూపంలో సేకరించి, పెళ్లి జరుపుకునే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధానాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది గ్రామంలో మొదటి పెళ్లి జరుపుకుంటున్న మెస్రం జైతు కుటుంబానికి సేకరించిన నిధిని గ్రామస్థులు అందజేశారు. పెళ్లిళ్లలో అనవసర ఖర్చులు తగ్గి పేద కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని గ్రామ పెద్దలు తెలిపారు.