చెన్నై, ఆగస్టు 22: హిందీని దేశమంతా బలవంతంగా రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కొత్త నేర సంబంధిత న్యాయ బిల్లులు, వాటి ద్వారా హిందీ రుద్దుడు ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ల సమాఖ్య 10 రోజులకు పైగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఆందోళనలకు పిలుపునిచ్చింది. మూడు బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బిల్లులకు హిందీ భాషలో పేర్లను పెట్టడాన్ని వ్యతిరేకించింది. ఈ మేరకు సోమవారం జరిగిన తమిళనాడు అండ్ పుదుచ్చేరి అడ్వకేట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంతో తీర్మానం చేశారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు హిందీలో పెట్టిన పేర్లు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ను(సుప్రీంకోర్టు, హైకోర్టులు, చట్టాలు, బిల్లుల్లో వినియోగించాల్సిన భాష) ఉల్లంఘిస్తున్నదని తీర్మానం పేర్కొన్నది. ఈ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని అడ్వకేట్లు హెచ్చరించారు. బిల్లులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు బార్ అసోసియేషన్లు బుధవారం కోర్టుల ముందు ఆందోళన చేపడుతాయని తీర్మానం వెల్లడించింది. తిరుచ్చిలో భారీ ఆందోళన తర్వాత పెద్ద ర్యాలీ ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తున్నామని చెబుతూ.. ఆ పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నదని ఆలిండియా లాయర్స్ యూనియన్ మరో తీర్మానంలో పేర్కొన్నది. ఈ బిల్లులను అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకొచ్చారని మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది సీ విజయ్కుమార్ ఆరోపించారు. మూడు బిల్లుల్లోని చాలా నిబంధనలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చారే తప్ప, ఇందులో ప్రజా ప్రయోజనాలేమీ లేవని విమర్శించారు.