చేనేత వస్ర్తాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్సీ ఎల్. రమణ డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమ నడ్డివిరిచేందుకే బీజేపీ సర్కారు కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలనే డిమాండ్తో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పీవీ మార్గ్లో బుధవారం నిర్వహించిన హ్యాండ్లూమ్ మార్చ్లో పద్మశాలి సంఘం నేతలు, కార్మికులతో కలిసి ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు. అదేవిధంగా మార్చ్లో నటి పూనమ్ కౌర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అనేక కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే విధిస్తున్న 5శాతం జీఎస్టీని 12శాతానికి పెంచాలని నిర్ణయించి, వ్యతిరేకత వెల్లువెత్తడంతో వాయిదా వేసిందని వివరించారు. అయినప్పటికీ పరోక్షంగా మళ్లీ జీఎస్టీని విధించాలని యోచిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇకనైనా చేనేతపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. జీఎస్టీని పెంచాలని చూస్తే కచ్చితంగా అడ్డుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించారు.
మార్చ్లో పాల్గొన్న సినీనటి పూనమ్కౌర్ మాట్లాడుతూ చేనేతపై జీఎస్టీని విధిస్తే ఆ రంగం కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగం దేశానికి వెన్నముకని వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమె కోరారు. మార్చ్లో పద్మశాలి సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.