హనుమకొండ చౌరస్తా, జూన్ 27: శాస్త్రీయ ఫలితాల ద్వారా సమాజానికి ప్రయోజనం చేకూరాలని కేయూ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం, యునైటెడ్ కింగ్డమ్, వేల్స్, అబెర్యస్త్వ్యత్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంగళవారం కేయూ వీసీ ప్రారంభించి ప్రసంగించారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార కొరత తీరిందన్నారు. జన్యుసవరణ (జీనోమ్ ఎడిటింగ్)తో నూతన వంగడాల ఉత్పత్తి పెరుగుదల సాధ్యమని అన్నారు. ‘జీనోమ్ ఎడిటింగ్ రెవల్యూషన్ ఇన్ లైఫ్ సైన్స్’ అంశంపై అమెరికా సంయుక్త రాష్ట్రాల జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ ఆచార్యులు శ్రీనివాసన్ చంద్రసేగరాన్ మాట్లాడారు. ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్’ సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్’ అడ్జెంక్ట్ ఆచార్యులు ఏ సదానందం, ఆస్ట్రేలియా ముర్దాక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంజీకే జోన్స్, అబెర్యస్త్వ్యత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూయిస్ మూర్, ప్రొఫెసర్ డైలాన్ ఫిలిప్స్, ప్రొఫెసర్ హ్యు జోన్స్, రైస్ రీసెర్చ్ ఇన్స్ట్టిట్యూట్ సంచాలకులు ప్రొఫెసర్ ఆర్ఎం సుందరం, మలేసియా, మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ అన్ హరికృష్ణ, సింగపూర్, నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ పీ కుమార్ పాల్గొన్నారు. 120 పరిశోధన పత్రాలు రాగా, మొదటి రోజు 40 మంది వివిధ అంశాలపై పోస్టర్లు సమర్పించారు.