ఎదులాపురం, మార్చి 16 : జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సరిహద్దులోని మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నదని, సమీప బేల, జైనథ్, తాంసి, తలమడుగు, గాదిగూడ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామస్థాయి అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. వైరస్ బారినపడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తరచూ శానిటైజేషన్ చేస్తూ ఉండాలన్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా అలాంటి చర్యలే తీసుకోవాలన్నారు. ప్రజలు గుంపులుగుంపులుగా ఒకే ప్రాంతంలో ఉండకూడదని, కరోనా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ, రవీంద్రనగర్, టీచర్స్కాలనీ, తిర్పెల్లి, శాంతినగర్, శ్రీనగర్ కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో మాదిరిగానే సర్కిళ్లు ఏర్పాటు చేయాలని దుకాణా యజమానులను ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాధన, డీపీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, తహసీల్దార్ భోజన్న పాల్గొన్నారు.