హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వరుస ఎన్నికల కోడ్లతో కొంతకాలంగా ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో రాష్ట్రంలో ప్రగతిరథం మరింత వేగంగా పరుగు తీయనున్నది. ఎన్నికల నియమ నిబంధనల కారణంగా కొంత మందగించిన ప్రభుత్వ కార్యక్రమాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. శ్రీరంగం పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకొన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. వెంటనే కార్యాచరణలోకి దిగారు. ముందుగా మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్కు ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల కార్పొరేషన్కు గాయకుడు సాయిచంద్, ఖనిజాభివృద్ధి కార్పొరేషన్కు మన్నె క్రిశాంక్ను ఎంపిక చేశారు. ఈ నియామకాలపై జీవో కూడా జారీ అయింది. ఈ ముగ్గురూ దళితులే కావడం విశేషం. మరోవైపు.. ఈ నెల 17న టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ కార్యవర్గంతోపాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. మరుసటిరోజు శనివారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించి, జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు. ఇదే సమావేశంలో దళితబంధుపైనా చర్చిస్తారు. ఈ నెల 19 నుంచి జిల్లాల పర్యటనను సీఎం ప్రారంభిస్తారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ ఒకవైపు అధికార యంత్రాంగానికి మరోవైపు పార్టీ శ్రేణులకు సరికొత్త దిశానిర్దేశాన్ని చేయనున్నారు.
ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు జమిలిగా సాగించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేపడుతున్నారు. జిల్లా పర్యటనల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షలు, సమీకృత జిల్లా కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలతోపాటు టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. 19న వనపర్తి, 20న జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. తర్వాత వరుసగా నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.
ఈ నెల 17 (శుక్రవారం)న తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.
ఈ నెల 18న, దళితబంధు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమీక్షించనున్నారు. ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీనియర్ అధికారులు పాల్గొంటారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన 4 మండలాల్లో అమలులోకి వచ్చిన దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన పద్ధతిలో మార్చిలోపు అమలు చేసే అంశంపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం సేకరణ అంశంపైనా సీఎం సమీక్షిస్తారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు కూడా పాల్గొంటారు.
ఈ నెల 19న ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సోమవారం 20న జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వీటితోపాటు సీఎం కేసీఆర్ త్వరలో మరికొన్ని జిల్లాల పర్యటన తేదీలు ఖరారు కానున్నాయి. ఇందులో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉమామహేశ్వర లిఫ్టు మరియు రిజర్వాయర్కు శంకుస్థాపన చేస్తారు. వంద పడకల దవాఖాన ప్రారంభించనున్నారు
తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించే చట్టసభల సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వడ్ల కొనుగోళ్లు, వ్యవసాయంపై జాతీయ విధానం విషయంలో కేంద్రం వైఖరిపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 10 రోజులపాటు వరుసగా టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అయినా కేంద్రం పట్టించుకోలేదు. పైగా స్థానిక బీజేపీ నేతలు రాష్ట్ర రైతాంగాన్ని అయోమయానికి గురిచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతు ప్రయోజనాలకోసం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు దళితబంధు పథకం ప్రాముఖ్యత, దాని పర్యవసనాలు, ప్రభావాలపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణపై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ శ్రేణులు అనుసరించాల్సిన వైఖరిపై సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేస్తారు.