Srisailam | హైదరాబాద్ : శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. అయితే రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో డి పెద్దిరాజు తెలిపారు. శని, ఆది, సోమవారాలతో పాటు సెలవురోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందాలన్నారు.
మరోవైపు కార్తీక మాసంలోని శని, ఆది, సోమవారాల్లో భక్తులందరికి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన రద్దు చేసినట్లు ఇప్పటికే తెలిపారు. శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శదర్శనాలు రద్దు చేశారు. సాధారణ రోజుల్లో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమితి సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.