కామారెడ్డి, జూలై 6 : కామారెడ్డి పట్టణంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలన సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. రెండు రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఉన్న ఓపెన్ ప్లాటులో బండరాళ్లు పేల్చేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డికి చెందిన శ్రీవారి ఏకో టౌన్షిప్ నుంచి జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చారు. విషయం పోలీసులకు తెలియడంతో శ్రీవారి వెంచర్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను తన వెంచర్లో నిల్వ చేయడంతోపాటు ఇతరులకు సరఫరా చేసిన కేసులో చంద్రశేఖర్రెడ్డిని శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించినట్టు సమాచారం. ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నట్టు తెలిసింది. చంద్రశేఖర్రెడ్డి సోదరుడు సురేందర్రెడ్డి పరారీలో ఉన్నాడని, ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.
రెండేండ్ల క్రితం ఈ వెంచర్ను అభివృద్ధి చేసిన చంద్రశేఖర్రెడ్డి ఇతరులకు విక్రయించాడు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పేలుళ్లు జరగడంలేదు. తాజాగా అధికార కాంగ్రెస్ నేతను అరెస్టు చేయడంలో మరో బడా నేత ప్రమేయం ఉన్నదని, కొద్దిరోజులుగా వారి మధ్య విభేదాలు తలెత్తడమే అరెస్టు వరకు దారితీసిందని సొంత పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. జిల్లాలో చిన్న దొంగతనం, హత్య జరిగినా ప్రెస్మీట్ పెట్టి వివరాలు తెలియజేసే పోలీసులు ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి విషయాలు అధికారికంగా వెల్లడించలేదు. గోప్యంగా ఉంచడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై చంద్రశేఖర్రెడ్డి సతీమణి కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఇందుప్రియ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త అరెస్టులో రాజకీయ కుట్ర ఉన్నదని ఆరోపించారు.