హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్చంద్రశర్మ నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. జస్టిస్ సతీశ్చంద్రశర్మ చేత సోమవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఆయనతోపాటు పలువురు న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కొలీజియం సిఫారసుల్లో భాగంగా పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావుకు శనివారం తెలంగాణ హైకోర్టు వీడ్కోలు పలికింది. ఈ నెల 12న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
బంగారు పతకాల విజేత జస్టిస్ శర్మ
జస్టిస్ సతీశ్చంద్రశర్మ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1961 నవంబర్ 30న జన్మించారు. వ్యవసాయరంగ నిపుణుడిగా పేరొందిన ఆయన తండ్రి బీఎన్ శర్మ భర్కతుల్లా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్గా, తల్లి శాంతిశర్మ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. జబల్పూర్లో ఇంటర్, సాగర్లోని హరిసింగ్గౌర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. మూడు సబ్జెక్టుల్లో డిస్టింక్షన్ సాధించి, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్ఎల్బీ పూర్తిచేయడంతోపాటు మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబర్ 1న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకొన్న ఆయన 2003లో మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 42 ఏండ్ల వయస్సులోనే ఆయన ఈ హోదా సాధించడం విశేషం. 2004లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానల్ కౌన్సిల్గా నియమితులయ్యారు. 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2010 శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి 4న కర్ణాటక న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. గత ఆగస్టు 31నుంచి కర్ణాటక హైకోర్టులో తాతాలిక సీజేగా వ్యవహరిస్తున్నారు.
నాలుగో సీజేగా జస్టిస్ సతీశ్చంద్రశర్మ
2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ సతీశ్చంద్రశర్మ 4వ వారు. తొలి సీజేగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, అనంతరం జస్టిస్ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.
జస్టిస్ ఎమ్మెస్సార్కు వీడ్కోలు
పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావుకు హైకోర్టు శనివారం వీడోలు పలికింది. జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏజే బీఎస్ ప్రసాద్, ఏఏజే జే రామచంద్రరావు, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్ రాజేశ్వరరావు, పీపీ ప్రతాప్రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.