హైదరాబాద్ సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సులకు సంబంధించి ఫిజికల్ రూపంలో ఉన్న సర్టిఫికెట్ల విధానానికి స్వస్తి పలుకాలని జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయించింది. ఇకపై అన్ని రకాల డిగ్రీ సర్టిఫికెట్లను డిజిలాకర్లో పెట్టబోతున్నది. ఈ మేరకు యూజీసీ ఆధ్వర్యంలో ఉండే డిజిలాకర్ వెబ్సైట్లో జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేసుకున్నదని, దీనికి త్వరలోనే అనుమతులు లభిస్తాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
ఈ విధానానికి యూజీసీ నుంచి త్వరలోనే అనుమతులు వస్తాయని, ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల సర్టిఫికెట్లన్నీ డిజిలాకర్లో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తామని తెలిపారు. దీంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పోగొట్టుకోవడం, డూప్లికేట్ కోసం పోలీసు కేసు పెట్టడం, చిరిగిపోవడం, తడిచిపోవడం, నలగడం, భద్రంగా దాచుకోడం, వంటి సమస్యలు రావని చెప్పారు. ఉద్యోగాలు, ఉపాధి, ఇతర ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థి వివరాలు ఇస్తే మొత్తం సర్టిఫికెట్లు డిజిలాకర్ ద్వారా నియామక సంస్థలు చూసుకునే విధంగా రూపొందించినట్టు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని రకాల ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలలో చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా డిజిలాకర్లో పెడ్తామని చెప్పారు. డిజిలాకర్లో ఉన్న సర్టిఫికెట్లకు పూర్తి భద్రత ఉంటుందని, దుర్వినియోగమయ్యే అవకాశాలు లేవన్నారు.