జమ్మికుంట, ఆగస్టు 26 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్వీట్హౌస్లో జరిగిన చిన్న వివాదం పోలీసుల అత్యుత్సాహంతో రణంగా మారింది. నడిరోడ్డు పైనుంచి యువకుడిని లాక్కెళ్తూ అంకుశం సినిమా తరహాలో కొట్టుకుంటూ ఠాణాకు తరలించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ సిబ్బంది అత్యుత్సాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన అంగరిక రాజు బుధవారం జమ్మికుంటకు వచ్చాడు. పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ స్వీట్ హౌస్లో తినుబండారం కొనుగోలు చేసే క్రమంలో ధర విషయంలో తేడాపై స్వీట్ హౌస్ నిర్వాహకుడిని రాజు నిలదీశాడు. దీంతో స్వీట్ హౌస్ నిర్వాహకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అప్పటికే స్వీట్హౌస్ నిర్వాహకులు రాజుపై దాడి చేశారని సమాచారం. దీంతో రాజు స్వీట్హౌస్ మూసివేసేందుకు యత్నించగా నిర్వాహకులు, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు స్వీట్హౌస్ నిర్వాహకుడికే వత్తాసు పలుకడంతో రాజు రోడ్డుపై బైఠాయించాడు. దీంతో పోలీసులు అత్యుత్సాహంతో నడిరోడ్డు మీద రాజును లాక్కుపోవడం, ఠాణా సమీపంలో విచక్షణారహితంగా చితకబాదడంతో గాయాలయ్యాయి. దీంతో రాజు రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుంటానని రోదించాడు. పోలీసుల వైఖరిపై స్థానికులు మండిపడ్డారు. తెలంగాణ చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. సీఐ రామకృష్ణ వచ్చి బాధితుడితో మాట్లాడారు. జరిగిన ఘటనపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చాడు. బాధితుడిని దవాఖానకు తరలించడంతో వివాదం సద్దుమణిగింది.