జైనథ్, మే 11: మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలులో జాప్యం జరుగడంతో వారం రోజులుగా రైతులు పడుతున్న బాధలు చూడలేకపోతున్నానని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాస సంతోష్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు న్యాయం చేయలేకపోతున్నందుకు మార్కెట్ డైరెక్టర్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కనీసం గన్నీ బ్యాగులు, తాగునీరు అందుబాటులో లేవని అన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు.
లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి ; నేడు కార్మిక సంఘాల నిరసనలు రైతు సంఘం
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, మంగళవారం కార్మిక సంఘాలు చేపట్టే నిరసనలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టేందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం పోరాడుతున్న కార్మికవర్గానికి అండగా నిలువాలని విద్యావంతులు, మేధావులను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ కోరారు. సోమవారం రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఈ నెల 8న నాలుగు లేబర్కోడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ కోడ్ల ద్వారా కార్మికుల పనిగంటలు, కనీస వేతనాలు, సమ్మెలు నిర్వహించే హకులను కూడా హరించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.