హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలంటూ ఒక వ్యక్తి వినూత్నంగా నిరసన తె లిపాడు. ఇమ్లిబన్ – పుత్లిబౌలి రోడ్లో ఎంజీబీఎస్ బస్స్టేషన్ నుంచి కోఠి , చాదర్ఘాట్ వరకు విపరీతమైన రద్దీ ఉంటు ంది. ఈ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా, ప్రమాదకరంగా మారిందంటూ ఫిరోజ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి గుంతల దగ్గర నడిరోడ్డుపై బైఠాయించాడు. పోలీసులు వచ్చి అక్కడ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా రోడ్డు బాగుపడేవరకు తాను ఎక్కడికీ కదిలేది లేదంటూ వర్షం నీటిలోనే పడుకుని నిరసన తెలిపాడు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి.
ఫిరోజ్ నిరసనకు మద్దతు తెలుపుతూ పలువురు సోషల్మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. సముదాయించినా ఫిరోజ్ వినకపోవడంతో పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ఫిరోజ్ చేసిన పనిని పలువురు నెటిజన్లు మెచ్చుకుంటూ రోడ్ల అధ్వాన పరిస్థితిపై మండిపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని, వర్షం పడితే ఆ నీరు గుంతల్లో చేరి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు నగర ప్రజలు సోషల్మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.