Bio Asia 2023 | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ఫార్మారంగంలో రాబోయే దశాబ్దం భారత్దే అని.. దీనికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేండ్లలో దేశీయ మెడికల్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని పలు కంపెనీల అధినేతలు అభిప్రాయపడ్డారు. అనుమతుల ప్రక్రియ మాత్రం సులభతరం కావాలన్నారు. బయో ఏషియాలో భాగంగా శుక్రవారం సాయంత్రం సీఈవో కాంక్లేవ్ నిర్వహించారు. ఇందులో మంత్రి కేటీఆర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ ఎం సతీశ్రెడ్డి, పిరమల్ ఫార్మా చైర్పర్సన్ నందినీ పిరమల్, బయోలాజికల్-ఈ ఎండీ మహిమా దాట్ల, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ సీఎండీ గ్లెన్ సల్దాన్హా, జుబిలియంట్ భార్తియా గ్రూప్ ఫౌండర్, కో చైర్మన్ హరి ఎస్ భార్తియా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎన్బీసీ-టీవీ 18 ఎండీ షెరీన్ మోడరేటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు.. వారి సమాధానాలు వారి మాటల్లోనే..
కేటీఆర్: వాల్యూమ్ నుంచి వాల్యూకు మారాలంటే.. మూడు అంశాలపై దృష్టిపెట్టాలి. ‘ఇన్నోవేషన్ (ఆవిష్కరణలు), ఆపరేటింగ్ ఆన్ స్కేల్ (భారీ స్థాయిలో ఉత్పత్తులు), ఐపీ ప్రొటెక్షన్ (మేధోపరమైన రక్షణ)’ అవసరం. ఈ మూడు అంశాలు గొప్ప మార్పును తీసుకొస్తాయి. ప్రస్తుతం ఫార్మా, వ్యాక్సిన్స్, బయోటెక్నాలజీ, మెడ్ టెక్నాలజీ, హెల్త్ టెక్ రంగాల్లో తెలంగాణ ఒక పవర్హౌస్గా ఉన్నది. భవిష్యత్తులోనూ తెలంగాణే లీడర్గా కొనసాగుతుంది.
సతీశ్రెడ్డి: ఆవిష్కరణలు చేసే సామర్థ్యం ఉన్నదని భారతీయులు ఎప్పుడో నిరూపించారు. ఇప్పుడు కావాల్సింది పెట్టుబడులు. అంటే.. డబ్బు ఇవ్వడం కాదు, ఎకో సిస్టమ్ను నిర్మించాలి. పెద్ద కంపెనీలు పరిశోధనలు చేసే సమయంలోనే ఎంత పెట్టుబడి పెడుతున్నాం? ఎంత లాభాలు వస్తాయి? వంటి లెక్కలన్నీ వేసుకుంటాయి. స్టార్టప్లకు మాత్రం, ముందు వాళ్లు నిరూపించుకున్న తర్వాతే పెట్టుబడులు వస్తాయి. మరి వాళ్లకు ప్రాథమిక స్థాయిలో పరిశోధనలు చేసేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ప్రభుత్వాలు ముందుకొచ్చి సొంతంగా లేదా పెట్టుబడిదారులతో (వెంచర్ క్యాపిటలిస్ట్స్) కలిసి నిధిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అప్పుడే స్టార్టప్లకు ప్రోత్సాహం, వారిలో నమ్మకం పెరుగుతుంది.
గ్లెన్ సల్దాన్హా : మేం గత 23 ఏండ్లుగా పూర్తిగా పరిశోధనలకే పరిమితమయ్యాం. ఇందులో విజయాలు, పరాజయాలు ఉన్నాయి. ఏడు లైసెన్సులు పొందాం. మా మేధోసంపత్తి హక్కుల ద్వారా 300 మిలియన్ డాలర్ల లబ్ధి పొందాం. ఇప్పుడు ఆంకాలజీ, ఇమ్యునాలజీల్లో కొన్ని ఔషధాల తయారీ చివరి దశలో ఉన్నాం. రాబోయే దశాబ్దంలో ప్రపంచస్థాయి ఉత్పత్తులను పరిచయం చేస్తామనే నమ్మకం ఉన్నది. ఆవిష్కరణలు చేయగలిగే ఎకో సిస్టం నిర్మించడం చాలా కష్టం.. ఇప్పుడు దేశంలో ప్రభుత్వ స్థాయిలో ఇలాంటి వ్యవస్థ రూపొందుతున్నది.
నందినీ పిరమల్: మనం చైనా తరహా ప్రణాళిక అమలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులైన చైనీయులను తిరిగి రప్పించుకొన్నది. అలాగే మనకు కూడా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన మానవ వనరులు ఉన్నాయి. వారిని సరిగ్గా వినియోగించుకోవాలి.
సతీశ్రెడ్డి: దేశంలో ఫార్మా రంగం ఎన్నడూ లేనంత వేగంగా పురోగమిస్తున్నది. జీవనశైలి వ్యాధులు పెరుగుతుండటం కూడా మార్కెట్ పెరగడానికి కారణం. బయోసిమిలర్స్ వంటి కొత్త ఆవిష్కరణలు దేశీయ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఏఐ, టెలిమెడిసిన్, ఈ ఫార్మసీ వంటి డిజిటల్ వేదికలు, వైద్యరంగంలో వసతులు పెరిగిన కొద్దీ మార్కెట్ అవకాశాలు పెరుగుతున్నాయి.
హరి ఎస్ భార్తియా: భారీగా ధర పెట్టి ఔషధాలు కొనే శక్తి భారతీయులకు ఉండదు. కాబట్టి తక్కువ ఖర్చులోనే నాణ్యమైన ఔషధాలను భారత మార్కెట్కు అందిస్తే అపారమైన అవకాశాలు ఎదురొస్తాయి. దేశంలో క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ చాలా ఆలస్యం అవుతున్నది. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, మన దగ్గరే క్లినికల్ ట్రయల్స్ చేయగలిగితే ధరను 150వ వంతుకు తగ్గించవచ్చు.
గ్లెన్ సల్దాన్హా: దిగుమతి చేసుకునే ఖరీదైన పరికరాలపై ప్రభుత్వం రాయితీలు ఇస్తే.. మంచి ఈకోసిస్టం నిర్మాణం అవుతుంది, ఆవిష్కరణల్లో వేగం పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్ఎల్ఐ, పీఎల్ఐ స్కీముల ద్వారా ప్రోత్సాహం ఇస్తున్నది.
నందినీ పిరమల్: ముందు ప్రజారోగ్య రంగాన్ని సంస్కరించాలి. డిజిటల్ హెల్త్ రికార్డులు ప్రవేశపెట్టాలి. అప్పుడే ఆరోగ్యంపై పర్యవేక్షణ పెరుగుతుంది. ఉత్తమ చికిత్స అందుతుంది.
మహిమా దాట్ల: దేశవ్యాప్తంగా ప్రభుత్వం పిల్లలకు వ్యాక్సిన్లను పూర్తి ఉచితంగా ఇస్తున్నది. ఇది మాలాంటి కంపెనీలకు గొప్ప వరం లాంటింది. ఇది ఆవిష్కరణలకు, ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఉంటున్నది.
కేటీఆర్: మన లాంటి దేశాల్లో ఇప్పటికీ అభివృద్ధి, సంక్షేమంపై సమ దృష్టిపెట్టాల్సి ఉన్నది. ఇలాంటి సమయంలో పరిశోధనలకు పూర్తిగా నిధులు సమకూర్చడం పెద్ద సవాలు. కాబట్టి రాయితీలు ఇవ్వడం ఉత్తమం. ముఖ్యంగా మంచి ఎకోసిస్టమ్ను తయారు చేయడం ప్రధానం. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ఆర్థిక సదస్సుతో (డబ్ల్యూఈఎఫ్) చేతులు కలిపి సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ను ఏర్పాటు చేస్తున్నది. ఇలాంటి ఒప్పందాలు ఎంతో అవసరం.
గ్లెన్: ప్రస్తుతం ఫార్మారంగంలో మన దేశం పవర్ హౌజ్గా ఉన్నది. మార్కెట్ ఉంది, కానీ ఆవిష్కరణలకు తగిన వాతావరణం లేదు. అత్యాధునిక టెక్నాలజీకి దూరంగా ఉన్నాం. వీటిపై దృష్టిపెడితే గ్లోబల్ లీడర్గా మారుతాం.
నందినీ పిరమల్: భారత ఫార్మారంగం క్వాలిటీని కొనసాగించాలి. దేశీయంగా క్వాలిటీ ఆర్గనైజేషన్స్ సంఖ్య పెంచుకోవాలి. ప్రపంచ ప్రమాణాలను అందుకోవాలి.
మహిమా దాట్ల: మా దృష్టి ఆర్ అండ్ డీపై ఉన్నది. ముఖ్యంగా ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్లు, చికిత్పపై పరిశోధనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బయోసిమిలర్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ పైగా దృష్టిపెట్టాం. మేం ఆర్ అండ్ డీలో 15-16 శాతం వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.
నందిని: డిజిటైజేషన్పై ఆసక్తిగా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతున్నది. ఆరోగ్య రంగంపై పెడుతున్న ఖర్చు పెరగాలి.
గ్లెన్: ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ మారబోతున్నది. వచ్చే దశాబ్దంలో మన కంపెనీలు ప్రపంచాన్ని ఏలుతాయి.
హరి: మనం భారతీయులకోసం ఆవిష్కరణలు చేసి, అనుమతుల ప్రక్రియలో మార్పులు తెచ్చి, క్లినికల్ ట్రయల్స్కు సరైన మెకానిజం తీసుకొస్తే గొప్ప మార్పు సాధ్యం అవుతుంది.
కేటీఆర్: వచ్చే దశాబ్దం భారత్దే కావాలని నేను మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దీనికి తెలంగాణ నేతృత్వం వహిస్తుందని ఆశిస్తున్నాను. 2030 నాటికి రాష్ట్ర ఫార్మా రంగం విలువ 80 బిలియన్ డాలర్ల నుంచి 250 బిలియన్ డాలర్లకు ఎదుగుతుంది.
కేటీఆర్: స్టార్టప్లు లేదా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భారీ మొత్తంలో ఆర్ అండ్ డీపై ఖర్చు చేస్తుంటాయి. ఇలాంటి పరిశోధనలకు ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడి పెట్టలేకపోయినా.. నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని నేను ప్రతి సందర్భంలో చెప్తున్నాను.
హరి ఎస్ భార్తియా: ఆవిష్కరణల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది వేగంగా ఫలితం వచ్చేవి. ఇలాంటివన్నీ విద్యాసంస్థల్లో జరుగుతాయి. మరి వాళ్లకు పరిశోధనల కోసం డబ్బు ఎలా వస్తుంది?. అమెరికా వంటి దేశాల్లో ఎన్ఐహెచ్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు నిధులు ఇస్తాయి. మన దగ్గర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇస్తున్నా.. ఇంకా నిధులు అవసరం. రెండోది.. మీరు విద్యాసంస్థల్లో విజయవంతం అయితే కంపెనీలు తీసుకొని, తమ పరిశోధనల్లో భాగస్వాములను చేస్తాయి. ఏ ఆవిష్కరణ అయినా పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్తేనే నిధుల సమస్య ఉండదు.
మహిమా దాట్ల: దేశంలోని టాప్ 25 ఫార్మా కంపెనీలను తీసుకుంటే.. అవి ఆర్ అండ్ డీ కోసం 5-6 శాతం ఖర్చు చేస్తే.. 15-16 శాతం మాత్రమే లాభాలు పొందుతున్నాయి. అంతేకాదు.. ఆర్ అండ్ డీ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్నది. ఎక్కువ రిస్క్, చాలా ఆలస్యంగా ఫలితాలు వచ్చే రంగంలో డబ్బును పెట్టుబడిగా పెట్టాలని ఎవరూ అనుకోరు. బ్యాంకుకన్నా మెరుగైన వడ్డీరేటుతో వేగంగా లాభాలు వచ్చే చోటే ఇన్వెస్ట్ చేస్తారు.
కేటీఆర్: దేశంలో అనుమతులకు సంబంధించి సరళీకరణ జరగాలి. ఒక ఔషధం బయటికి రావాలంటే అనేక సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇది సహనాన్ని పరీక్షిస్తున్నది. ఇంత చేసినా భారత కంపెనీలకు పెద్దగా ప్రోత్సాహకం లభించడం లేదన్నది గుర్తించాలి.