హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మన దేశం తక్కువ ఖర్చుతో పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ పేర్కొన్నారు. నగరంలో రెండు రోజులు జరుగనున్న 20వ సీఐఐ ‘గ్రీన్ పవర్’ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం 20 శాతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని వచ్చే పదేళ్లలో 50 శాతానికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, రెగ్యులేటరీ, పాలసీ ఇకో సిస్టం, బిజినెస్ మోడల్స్, సుశిక్షిత ఉద్యోగులతో తక్కువ ఖర్చుతో నిరంతరం పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రెన్యువబుల్ ఎనర్జీ కౌన్సిల్ చైర్మన్ రమేశ్ క్యామల్ పాల్గొన్నారు.