బచ్చన్నపేట, మార్చి 24: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన రైతు రఘుపతిని పొట్టన పెట్టుకున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు వద్ద తీసుకున్న డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని, సదరు భూమిని రికార్డుల్లో ఎక్కించాలన్నారు.
ఆదివారం ఆయన పడమటికేశ్వాపూర్ గ్రామానికి వెళ్లి రఘుపతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. రైతు రఘుపతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. భూమి రికార్డుల్లోకి ఎక్కక పోవడంతోనే రఘుపతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. అధికారులకు డబ్బులు ఇచ్చి 18 నెలలు అవుతున్నా ఆ భూమి రికార్డుల్లోకి ఎక్కకపోగా మరిన్ని డబ్బులు అడగడంతో తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పారు.
ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ అధికారులు డబ్బులకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ఎక్కువ మొత్తంలో లంచాలు అడుగుతూ రైతులను పీడిస్తున్నారని విమర్శించారు. ధరణి ద్వారా 95 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. కేవలం మిగిలిన రైతుల భూములకు సంబంధించి సమస్యలు ఉన్నా అవి ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు.
గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలను గుర్తిస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతు రఘుపతి వద్ద డబ్బులు తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతు కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.