హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి సంస్థను రైతు ఉత్పత్తిదారు సంస్థల నిర్వహణకు అదనపు అమలు సంస్థగా గుర్తించాలని తెలంగాణ ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామ్రెడ్డి కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రులను కోరారు. రైతు ఉత్పత్తి దారుల సంస్థల 3వ దక్షిణ ప్రాంత ప్రాంతీయ సదస్సు శుక్రవారం బెంగళూరులో కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రులు శోభా కరంద్లాజే, కైలాస్ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ, కర్ణాటక,ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి. తెలంగాణ ప్రతినిధిగా రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 2021 నుంచి రైతు ఉత్పత్తి దారుల సంస్థల నిర్వహణ జరుగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాబార్డ్, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ), ఎస్ఎఫ్ఏసీ, నాఫెడ్ పూర్థిస్థాయిలో బాధ్యతలను నిర్వహిస్తున్నాయని అన్నారు. ఎఫ్డీఆర్వీసీ, ఎన్ఆర్ఎల్ఎంలను అదనపు అమలు స్థాయి సంస్థలుగా గుర్తించినట్టు వెంకట్రామ్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో 103 రైతు ఉత్పత్తి దారుల సంస్థలు (ఎఫ్పీవో) ఏర్పాటు చేయగా, వాటిలో 99 సంస్థలు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్నాయని పేర్కొన్నారు. అలాగే 56 సంస్థలు జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఆమోదం పొందాయన్నారు. 68 గ్రూపుల సీఈవో నియామకాలు పూర్తయి రూ.1.2 కోట్ల ఈక్విటీ గ్రాంట్ పొందినట్టు తెలిపారు.