హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కారంపొడి అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చే రంగు.. ఎరుపు. కానీ ఇప్పుడు కారంపొడి ఆకు పచ్చని రంగులోనూ అందుబాటులోకి రానున్నది. ఎండు మిర్చి నుంచే కాకుండా పచ్చి మిర్చి నుంచి కూడా కారంపొడి తయారు చేసే విధానాన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రిసెర్చ్ (ఐఐవీఆర్) ఆవిష్కరించింది. ఇందుకోసం ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనితో పచ్చి మిర్చిని ప్రత్యేక పద్ధతిలో ఆరపెట్టి పౌడర్గా మార్చుతారు.
ఇప్పటికే ఆకుపచ్చ కారంపొడి తయారీకి ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ సంస్థ త్వరలోనే ఆకుపచ్చ కారంపొడిని మార్కెట్లోకి తీసుకు రానున్నది. ఎరుపు రంగు పొడితో పోల్చితే ఆకుపచ్చ రంగు కారంపొడి ఘాటు, కారం ఎక్కువగా ఉంటాయని ఐఐవీఆర్ తెలిపింది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని పేర్కొన్నది. ఎరుపు రంగు మిర్చి పౌడర్ మాదిరిగానే దీన్ని కూడా సాధారణ స్థితిలోనే ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.