Hyderabad History | హైదరాబాద్ : విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో శతాబ్ద కాలంలో ఎన్నో అంశాలు భాగమయ్యాయి. ఇన్నేళ్లలో ఎన్నో యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, రీసెర్చ్ సెంటర్స్, ప్రైవేట్ ఆర్ అండ్ డీ కంపెనీలు, టెక్ కంపెనీ ఇలా ఇవన్నీ కొలువుదీరి హైదరాబాద్ దేశంలోనే ప్రముఖ సైన్స్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఇవి ఢిల్లీకి చెందిన కాలమిస్ట్, రచయిత డాక్టర్ దినేశ్ సీ శర్మ చేసిన వ్యాఖ్యలు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న ఇండియా సైన్స ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ కైకూ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిపై తన గళం వినిపించారు.
శాస్త్ర, విజ్ఞాన రంగాల సామర్థ్యాన్ని హైదరాబాద్ మహానగరం 1591లోనే గుర్తించిందని దినేశ్ శర్మ ప్రశంసించారు. చార్మినార్ కట్టడం ఒక అద్భుతమని.. ఎన్నో అంశాలకు ఇది ఆదర్శమని కొనియాడారు. డిజైన్, ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్, మేథమేటిక్స్, లోహ శాస్త్రం, టౌన్ ప్లానింగ్, నీటి వ్యవస్థ, ఈస్తటిక్స్, ఫిలాసఫీ, రిలీజియన్ వంటి ఎన్నో విభాగాలకు చార్మినార్ డిజైన్ ఆదర్శమని కొనియాడారు. మలేరియా పరాన్న జీవి జీవిత చక్రాన్ని కనుగొన్నది కూడా బేగంపేటలోని ఇండియన్ మిలటరీ హాస్పిటల్లో పనిచేసేటప్పుడే కనుగొన్నారని వెల్లడించారు.
ప్రపంచంలోనే అరుదైన ఖగోళ పరిశోధన సంస్థగా కీర్తిపొందిన నిజామియా అబ్జర్వేటరీ కూడా హైదరాబాద్లోని బేగంపేటలోనే ఉందని గుర్తు చేశారు. ఈ అబ్జర్వేటరీకి వచ్చిన ఓ చిన్న పిల్లాడు ఇక్కడ నక్షత్రాలతో అనుబంధాన్ని పెంచుకున్నాడని.. ఆ తర్వాత ఆధునిక ఖగోళ శాస్త్రానికి పితామహుడుగా ఎదిగాడని తెలిపారు. అతనే వైపు బప్పు అని పేర్కొన్నారు.
హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమయ్యే సమయానికే ఇక్కడ రెండు రీసెర్చ్ సెంటర్స్ మాత్రమే ఉండేవని చెప్పారు. సెంట్రల్ ల్యాబరేటరీస్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ( CLSIR ), హైదరాబాద్ సైన్స్ సొసైటీ ఈ రెండూ కూడా పరిశోధన రంగం కొత్తపుంతలు తొక్కడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. సీఎల్ఎస్ఐఆర్ తర్వాత కాలంలో రీజినల్ రీసెర్చ్ ల్యాబరేటరీ ( RRL )గా మారిందన్నారు. ఇది హైదరాబాద్ను ఫార్మా రంగంవైపు అడుగులు వేసేలా చేశాయి. ఐడీపీఎల్ ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. ఆర్ఆర్ఎల్ తర్వాత రోజుల్లో హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలివెళ్లింది. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికిల్ టెక్నాలజీగా దీన్ని పిలుస్తున్నారు.
హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఏర్పాటు సాఫ్ట్వేర్, ఐటీ విప్లవానికి నాంది పలికిందని డాక్టర్ శర్మ తెలిపారు. కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్వేర్, డిజైన్, అప్లికేషన్స్ రంగాల్లో ఉద్యోగులను అందించిందన్నారు. ఈసీఐఎల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో శిక్షణ తీసుకున్న వారు.. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీల్లో చేరి రాణించారని తెలిపారు. విప్రో తొలి బ్యాచ్ ఉద్యోగుల్లో చాలామంది ఈసీఐఎల్ ఆర్అండ్డీ విభాగం నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు.
అందుబాటు ధరలో మందులు అందించడం, ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్స్, డిజిటల్ ఉత్పత్తులు వంటి అన్ని ఆవిష్కరణల కోసం హైదరాబాద్కు చెందిన ఎస్ &టీ తనవంతు కృషి చేసిందని పేర్కొన్నారు. 1980 కి ముందు నుంచే ఇక్కడ ఈ గవర్నెన్స్ ఉందని తెలిపారు. ఓటింగ్ యంత్రాలు అయిన ఈవీఎంలు కూడా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. సుశిక్షితమైన మానవ వనరులు, ప్రతిష్ఠాత్మక సంస్థలు, అనుకూలమైన పాలసీలు అన్నీ కలిసి హైదరాబాద్ను సైన్స్సిటీగా రూపొందించాయని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక వారసత్వ పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.