హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హాఫ్ మారథాన్లో రమేశ్ చంద్ర, ప్రజక్తా గాడ్బోలే విజేతలుగా నిలిచారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ప్రతిష్ఠాత్మక మారథాన్ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు.
ఏజీయస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు) పురుషుల విభాగంలో రమేశ్ చంద్ర ఒక గంట 13 నిమిషాల 10 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువగా.. సతీశ్ కుమార్ (1.15:50), పియూష్ మసానే (1.16:56) వరుసగా రజత కాంస్యాలు దక్కించుకున్నారు.
మహిళల విభాగంలో ప్రజక్తా ఒక గంట 23 నిమిషాల 45 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. ప్రీను యాదవ్ (1.24:46), తేజస్విని (1.25:11) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 8 వేల మందికి పైగా రన్నర్స్ ఇందులో పాల్గొనగా.. విజేతలకు సచిన్, గోపీచంద్ ట్రోఫీలు అందజేశారు. 10 కిలోమీటర్ల విభాగంలో చేతన్ కుమార్ (34 నిమిషాల 21 సెకన్లు), శీలూ యాదవ్ (41 ని. 34 సె.) అగ్రస్థానంలో నిలిచారు.