హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వోద్యోగం ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక అని రిటైర్డ్ ఐఏఎస్, ఎంసీఆర్హెచ్ఆర్డీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రశాంత్ మహాపాత్ర తెలిపారు. బాధితుల కోణంలో ఉద్యోగులు ఆలోచించాలని, అప్పు డే సమస్య తీవ్రత అర్థమవుతుందని సూచించారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో 112 మంది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు సమావేశంలో ఆయన ఉపన్యసించారు. సమస్య మూలాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని హితవు పలికారు.
దేశాన్ని నేటికీ పేదరికం, నిరక్షరాస్యతతోపాటు అనేక సమస్యలు వేధిస్తున్నాయని, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలని సూచించారు. కోర్సులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మనీశ్కుమార్కు షీల్డ్ బహూకరించారు. సమావేశంలో ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బెన్హూర్ మహేశ్దత్ ఎక్కా, కోర్సు డైరెక్టర్ మాధవీ రావులపాటి, చీఫ్ కన్సల్టెంట్ కే తిరుపతయ్య, సీనియర్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.