Indiramma Rajyam | ‘ఓ తల్లి ప్రసవ వేదన పడుతున్నది. గంటలు గడుస్తున్నా ప్రసవం కావడం లేదు. తల్లినీ, బిడ్డనూ కాపాడుకుందామని దవాఖానకు వచ్చారు. అక్కడో తెలివైన వైద్యుడు.. ఓ పదిరూపాయలు లంచం ఇస్తాను త్వరగా పుట్టమ్మా’ అని కడుపులోని బిడ్డకు చెప్పాడు. గంటలు వేదనపడ్డా పుట్టని బిడ్డ.. లంచం మాట వినగానే క్షణాల్లో బయటికి వచ్చింది. ఇందిరాగాంధీ పాలనలో పుట్టబోయే బిడ్డకూడా లంచాలకు అలవాటుపడేలా కాంగ్రెస్ పాలన దిగజారింద’ని ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్సీ కొణిజేటి రోశయ్య విమర్శించారు. ఇదీ.. ఇందిరమ్మ పాలనంటే!! ఆనాడే కాదు.. నేటి వరకూ ఆ పార్టీ అవినీతి పంకిలం. కుంభకోణాలకు నిలయం. స్కాంగ్రెస్గా వినుతికెక్కిన కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకునే నేటి సంస్కృతికి ‘నాటి.. ఇందిరమ్మ రాజ్యం’ నాంది పలికింది.
‘ఇందిరమ్మ రాజ్యం తెస్తాం..’ అనేది కాంగ్రెస్ నాయకులకో ప్రార్థన గీతం అయింది. ఈ జమానాకు ఆమె రాజ్యం ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. కానీ, అప్పట్లో ఇందిరమ్మ రాజ్యం ఎంత సక్కగ ఉండేదో చెబితే అసలుకే ఎసరొస్తుందని.. పాలన తెస్తామంటారే కానీ, ఆమె హయాంలో జరిగిన సంగతులు ప్రస్తావించే సాహసం చేయడం లేదు.
ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల ఆధిపత్యం. తెలంగాణ నేతలది బానిసత్వం. వెరిసి ప్రాంతీయ అసమానతలు. రాజకీయ అస్థిరత! ఏడాదికో ముఖ్యమంత్రి. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడి ఆగమనం.. రాష్ట్రమంతా ఆగమాగం ఇదీ అసలు చరిత్ర!
నేటి కాంగ్రెస్ నేతలు చెబుతున్న నాటి ఇందిరమ్మ రాజ్యంలో.. ఎవరికి ఎప్పుడు మూడుతుందో తెలియదు, ఎవరి పదవి ఎలా ఊడుతుందో తెలియదు! సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ చుట్టూ నేతల లాబీయింగ్. పాలనను గాలికి వదిలేసి కుటిల రాజకీయాల్లో తలమునకలు కావడం ఇదీ చిత్రం. రాజకీయ సంక్షోభాలు, అస్థిర ప్రభుత్వాలు, పాలన గాడి తప్పడంతో పెచ్చరిల్లిన అరాచకాలు, మత కలహాలు, ఉపాధి కరువై ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువత… పదహారేండ్లు ఇదీ సీను!
సాగునీటి వనరులు లేక పగుళ్లు బాసిన పంట పొలాలు. జీవనాధారం లేక కుటుంబ పోషణ భారమై తల్లిదండ్రులు, భార్యాపిల్లలను ఊర్లోనే వదిలేసి ఎల్లలు దాటి వలసలు. అధికార యావ తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టని నాటి నేత పాలనను మేటిగా అభివర్ణిస్తూ.. నేటి కాంగ్రెస్ చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. అసలు ఇందిరమ్మ రాజ్యంలో దేశం, మన రాష్ట్రం ఎలా ఉండేదంటే..
హిట్లర్, ముస్సోలిని వంటి నియంతలకు మాత్రమే రాజ్యాంగం మెడలు వంచి మరీ అత్యున్నతాధికారాలు కైవసం చేసుకొన్న చరిత్ర ఉన్నది. అయితే, అత్యయిక స్థితి, ప్రజాహక్కుల ఉల్లంఘనలు, స్వార్థపూరిత నిర్ణయాలతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కూడా వారి వరుసలో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే, 16 ఏండ్ల (1966-1977, 1980-1984) ఇందిర రాజ్యంలో ఏముందని ప్రశ్నిస్తే..? ఎమర్జెన్సీ చీకటి రోజులు, ఎక్కడ చూసినా ఆకలికేకలు, రైతు ఆత్మహత్యలు, విద్యార్థి, రైతు ఉద్యమాల అణచివేతలు, హక్కుల ఉల్లంఘనలు, ఎన్కౌంటర్లు. ఇదీ చరిత్ర చెబుతున్న సత్యం.
హస్తినలో ఇందిర రాజ్యమేలుతున్న సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్లో.. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ప్రజల బాధలు వర్ణనాతీతం. సాగునీటి వనరులు లేక వర్షాధార పంటలే శరణ్యం. వర్షాభావ పరిస్థితులతో ఏటికేడు పంట దిగుబడి పడిపోయేది. దీనికితోడు భూమి శిస్తు భారం రైతులను కలవరపెట్టింది. పెట్టుబడి కోసం అధిక వడ్డీలతో అప్పులు చేయాల్సిన దుస్థితి. దిక్కుతోచక పరువు కోసం వేలాది మంది రైతులు బలవన్మరణం చెందారు. వడ్డీ వ్యాపారుల సంగతి అలా ఉంచితే, పదో, పరకో అప్పు ఇచ్చిన సహకార పరపతి సంఘాలు (అంజుమాన్ బ్యాంక్) నిర్దాక్షిణ్యంగా ముక్కుపిండి వసూళ్లు చేసేవి. ఆదుకోవాల్సిన సర్కారే కనికరం లేకుండా బకాయిల వసూళ్ల కోసం చెంబులు, గిన్నెలు బజార్లలో విసిరేసి రైతుల జీవితాలను బజారుపాలు చేసింది. రెక్కాడినా డొక్క నిండని పరిస్థితిలో ఏ ఊర్లో చూసినా పేగుల కేకలే! తినడానికి తిండిలేక ఆకలి చావులే!
ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పట్టించుకున్న నాథుడే లేడు. మత కలహాలు నిత్యకృత్యంగా ఉండేవి. తీవ్రవాదం పెరిగింది, నక్సలిజం రాష్ట్రమంతా విస్తరించింది. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, 1978 మార్చి 24న హైదరాబాద్లో రమీజా బీ అనే మహిళపై అత్యాచారం, ఆమె భర్త అహ్మద్ హుస్సేన్ లాకప్ డెత్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హైదరాబాద్లో హింస చెలరేగింది. వారం తిరక్కుండానే మార్చి 31న రమీజా బీని పోలీసులు కాల్చి చంపినట్టు పుకార్లు వ్యాపించాయి. దీంతో హైదరాబాద్ అట్టుడికిపోయింది. నగరంలో ఒకేరోజు 11 చోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. దీంటో 15 మంది చనిపోయినట్టు అధికారికంగానే ప్రకటించారు. ఈ ఉత్పాతం పర్యవసానం.. రాష్ట్ర రాజధాని 50 రోజులపాటు కర్ఫ్యూ నీడలో భయంగా కాలం వెళ్లదీసింది.
ఇక అప్పటి నుంచి హైదరాబాద్ మత కలహాలు, బందులు, బందూక్లకు కేరాఫ్గా మారిపోయింది. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980, ఫిబ్రవరిలో హైదరాబాద్లో అల్లర్లు జరగడంతో వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. అందులో 40 మంది మరణించినట్టు, 300 మంది గాయపడినట్టు అనధికారిక లెక్క. ఇలా కాంగ్రెస్ నేతలు చెబుతున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రాంతం రాజకీయ అస్థిరత, మత కల్లోలాలు, ఆకలి కేకలతో అల్లాడిపోయింది.
‘గరీబీ హఠావో’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇందిర.. ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొన్న దాఖలాలు కనిపించవు. మన రాష్ర్టానికే వస్తే… 1969లో ముల్కీ నిబంధనలు మళ్లీ పొడిగించాల్సిన గడువు వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని సచివాలయ ఉద్యోగులు అడుగుతూనే ఉన్నా.. ఆయన పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల్లో అసహనం పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఖమ్మంలో రవీంద్ర అనే విద్యార్థి నిరాహార దీక్ష చేపట్టడంతో.. అక్కడి నుంచి మొదలై 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారితీసింది. బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టింది. విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 400 మందికిపైగా ఉద్యమకారులను పొట్టనపెట్టుకున్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో 1971 సెప్టెంబర్ 30న బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టిన ఇందిర.. ఆయన స్థానంలో పీవీని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఆంధ్రాలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తడంతో ఏడాదిన్నర కూడా గడవకముందే 1973 జనవరి 10న పీవీ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అదే రోజు రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు 11 నెలలు, 1973 డిసెంబర్ 10 వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది! 1973 డిసెంబర్ 10న జలగం వెంగళరావును ముఖ్యమంత్రిని చేశారు. ఆయన ఐదేండ్లు పూర్తి పదవిలో ఉన్నప్పటికీ.. ఆ కాలంలో చోటు చేసుకున్న కల్లోలాలు కోకొల్లలు. ఎమర్జెన్సీకి తోడు రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కోసం బూటకపు ఎన్కౌంటర్లకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 1978 మార్చి 6న మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రెండేండ్లు గడవకముందే ఆయన్ని గద్దె దింపి టి.అంజయ్యను సీఎంగా ప్రకటించారు ఇందిర. ఏడాదిన్నర పూర్తికాకుండానే.. ఆయన స్థానంలో భవనం వెంకట్రామ్రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన్నైనా పూర్తి కాలం కొనసాగించారా? అంటే అదీలేదు! ఏడు నెలలకే భవనంను పక్కనపెట్టి, కోట్ల విజయభాస్కర్రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఇలా ఐదేండ్ల టర్మ్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి కాంగ్రెస్ సంస్కృతిని ఘనంగా చాటారు ఇందిరాగాంధీ! ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్కు ముఖ్యమంత్రులను తరచూ తొలగించడం రివాజుగా ఉండేది. ఇక రాష్ట్ర నేతలు తమ పదవులను కాపాడుకోవడమే పరమావధిగా ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి అవినీతిని పెంచి పోషించారు.
ఇందిర హయాంలో పాశ్చాత్య దేశాలతో దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఆయా దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకొనే చమురు, ఎరువులపై వాటి ప్రభావం పెద్దయెత్తున పడింది. దీంతో దేశంలో నిత్యావసర ధరలు మండిపోయేవి. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, విధానపరమైన లోపాలతో 1975-76లో ద్రవ్యోల్బణం 25 శాతానికి ఎగబాకింది.
ఒకవైపు పెరుగుతున్న ధరలు, మరోవైపు ఆహార సంక్షోభం వెరసి ఇందిర జమానాలో అమెరికా, రష్యా తదితర దేశాలు పంపే తిండిగింజల కోసం భారత్ ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకసారి భారత్కు గోధుమలను పంపించే నౌకను అప్పటి అమెరికా అధ్యక్షుడు లైండన్ బీ జాన్సన్ ఉద్దేశపూర్వకంగా పోర్టులోనే కొద్దిరోజులు నిలిపేశారు. దీంతో భారతీయులంతా విలవిల్లాడిపోయారు. చివరకు భారత్ అభ్యర్థన మేరకు జాన్సన్ నౌకను విడుదల చేశారు.
1975 జూన్ 25న ప్రారంభమై.. 21 నెలలపాటు భారత ప్రజాస్వామ్యాన్ని చీకట్లోకి నెట్టేసింది ఇందిర ఎమర్జెన్సీ నిర్ణయం. రాయబరేలి నుంచి ఎంపీగా గెలిచిన ఇందిర.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు సోషలిస్టు నాయకుడు రాజ్నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఆమె ఎన్నికను సవాల్ చేశారు. దీంతో ఇందిర ఎన్నిక చెల్లదని కోర్టు తీర్చునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. అయితే, ఇందిర ప్రభుత్వ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిని వ్యతిరేకిస్తూ అప్పటికే విపక్ష నాయకులు జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఉద్యమం క్రమంగా దేశమంతటా పాకింది. పరిస్థితులు చేజారిపోతుండటాన్ని గమనించిన ఇందిర.. కేవలం తన పదవిని కాపాడుకోవడానికి ఓ నిర్ణయానికి వచ్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకోకుండానే అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ వ్యతిరేకించకుండానే దీనికి ఆమోదం వేశారు. ఎమర్జెన్సీ చీకటి నిర్ణయంతో పౌరుల హక్కులన్నీ మంటగలిశాయి. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలకు ఇది గొడ్డలిపెట్టుగా మారింది. ఇందిర నిరంకుశ ధోరణిని ప్రశ్నించిన గళాల గొంతునొక్కారు. నిరసించిన కలాలను కాలరాశారు. విపక్ష నేతలను జైళ్ల్లల్లో పెట్టారు. న్యాయస్థానాలు, పత్రికలపై ఆంక్షల పర్వం కొనసాగింది. ప్రజావ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఎక్కడ చూసినా దారుణాలు, లూటీలు, హక్కుల ఉల్లంఘనలే.
కుంభకోణాలు, అక్రమాలకు ఇందిర పాలనాకాలం నెలవుగా మారింది. దేశమంతటా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సమయంలోనే ఆమె కుమారుడు సంజయ్ గాంధీకి 50 వేల మారుతీ కార్ల తయారీ కాంట్రాక్టు లైసెన్స్ ఇచ్చిన ఉదంతం తీవ్ర దుమారాన్ని రేపింది. జనాభా నియంత్రణ పేరిట అవివాహితులకు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం వివాదాస్పదమయ్యింది. ఇందిర పాలనలోనే తేజా లోన్స్, కైరాన్ స్కాం, పట్నాయక్ ఓన్ గోల్, మారుతీ లైసెన్స్ వంటి కుంభకోణాలు వెలుగుచూశాయి.
ఇందిర నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ దేశమంతటా విద్యార్థి, నక్సల్ ఉద్యమాలు జరిగాయి. పంజాబ్, కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాట్లు, ఈశాన్య రాష్ర్టాల్లో మావోయిస్టుల ఉద్యమాలు, ఎన్కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరుద్యోగులు, ఆదుకోవాలని రైతులు పెద్దపెట్టున ర్యాలీలు తీశారు. అయితే, వాటిపై ఉక్కుపాదం మోపిన ఇందిర ప్రభుత్వం.. వేలాదిమందిని జైలుకు పంపింది. ఒక్క ఎమర్జెన్సీ సమయంలోనే 1.4 లక్షలమందిని అకారణంగా అరెస్టు చేశారు. ఎన్కౌంటర్లలో వందలాది మంది మరణించారు. అప్పుల బాధ తాళలేక, ప్రభుత్వ సాయం అందకపోవడంతో వేలాదిమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇందిర హయాంలో నిరుద్యోగిత రేటు 10-11 శాతానికి పైగా ఎగబాకింది. నిత్యం కర్ఫ్యూలు, ఉద్యమాలు, అల్లర్ల కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ గణనీయంగా పడిపోయింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజులతో పోలిస్తే, 1976లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నదంటే ఇందిరమ్మ పాలన సక్కదనాన్ని అర్థం చేసుకోవచ్చు. వైద్య సదుపాయాలు సరిగ్గా ఉండేవి కాదు. ‘గరీబీ హఠావో..’ అంటూ ఎన్నికల ప్రచారంలో నినదించిన ఇందిర పాలనలోనే గతంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో పేదరికం పెచ్చరిల్లింది.
పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో తిష్ఠవేసిన ఖలిస్థాన్ తీవ్రవాదుల్ని ఏరివేసేందుకు ఇందిర 1984లో ‘ఆపరేషన్ బ్లూస్టార్’కు ఆదేశించారు. తర్వాత జరిగిన ఘటనల్లో దాదాపు పదివేల మంది మరణించినట్టు అంచనా. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ ఘటనపై అనంతర కాలంలో ఇందిర పశ్చాత్తాపం చెందారని ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ప్రముఖ నేత ఆర్కే ధావన్ పేర్కొన్నారు.