హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం బీసీ (BC) వ్యతిరేకతను మార్చుకోవాలని సూచిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ( Krishnaiah) ప్రధాని నరేంద్ర మోదీకి(Narendra Modi) లేఖ రాశారు. 76 సంవత్సరాలుగా బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, ఇంకా అణచివేత దోరణి ఎన్నాళ్లని ప్రశ్నించారు. ప్రధాని బీసీగా ఉండికూడా బీసీలకు ఏమి చేయడం లేదని ఆరోపించారు.
చదువుకునే బీసీలకు స్కీములు పెట్టరా అని లేఖలో పేర్కొన్నారు. దేశంలో బీసీలుగా పుట్టడమే నేరమా? అని నిలదీశారు. బీసీలకు ఏ రంగంలో కూడా ప్రజాస్వామిక విద్యా(Education), ఉద్యోగ(Employment), ఆర్థిక, రాజకీయ(Political) , పారిశ్రామిక జనాభా ప్రకారం వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. భారతదేశంలో అనేక సెంటిమెంట్లతో ఇంకా ప్రజలను తప్పుదారి పట్టించడం, మభ్య పెడుతామనే ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు.
బీసీలకు అభివృద్ధి పరిచేందుకు దృఢ నిశ్చయంతో జాతీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో జనగణనలో కులగణన, విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు ఇచ్చిన హామీ మాదిరిగానే బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న మాదిరిగా ఫీజు రియంబర్స్ మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాలని కోరారు. కులవృత్తులు కోల్పోయిన వృత్తి కులాల వారికి రూ. 20 లక్షలు సబ్సిడీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని తెలిపారు.