యాదాద్రి, నవంబర్ 2: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులును గౌరవ డాక్టరేట్ వరించింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతికి చెందిన ప్రాగ్జ్యోతిశ్ విశ్వ విద్యాపీఠం ఆయనకు అవార్డుతోపాటు డాక్టరేట్ను ప్రదానం చేసింది. బుధవారం గౌహతిలోని విశ్వవిద్యాలయంలో ఆ సంస్థ ఫౌండర్ షిమబ్రత దే చేతులమీదుగా నల్లన్థీఘళ్.. గౌరవ డాక్టరేట్తోపాటు ప్రాగ్జ్యోతిష్ గ్లోబల్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా విద్యాపీఠం ప్రతినిధులు నల్లన్థిఘళ్ దంపతులను సన్మానించారు. అనంతరం నల్లన్థీఘళ్ మాట్లాడుతూ.. వేద ఆగమ ప్రబంధం, జ్యోతిష శాస్త్రంపై చేసిన కృషి, సేవలకుగాను డాక్టరేట్, అచీవర్స్ అవార్డు లభించినట్టు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలో మొదటిసారిగా గౌరవ డాక్టరేట్ రావడం అనందంగా ఉన్నదన్నారు. 30 ఏండ్లకుపైగా యాదాద్రీశుడి సేవలో పాల్గొని తరిస్తున్న తనకు ఇలాంటి గొప్ప గుర్తింపు రావడం సంతృప్తినిచ్చిందని తెలిపారు.