హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్రను లోతుగా అధ్యయనం చేస్తేనే తెలంగాణ సమాజ పరిణామక్రమం పూర్తిగా అవగతమవుతుందని రాష్ట్ర సాహి త్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు 33 జిల్లాల సమగ్ర చరిత్రను చదువాలని కోరారు. మంగళవారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో ‘తెలంగాణ బిట్ బ్యాంక్’ పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్ ఆవిష్కరించారు. జూలూరు మాట్లాడుతూ.. ఉద్యోగార్థులకు జిల్లాల సమగ్ర విషయాలు తెలిసి ఉండాలని చెప్పారు. ఏ జిల్లాలో ఏ రకమైన విశేషాలున్నాయో, ఈ నేలకోసం జరిగిన త్యాగాలు, వీరుల చరిత్రలు, సహజ సంపదలు, సాహిత్య, సామాజిక, సాంస్కృతిక రంగాల విషయాలన్నింటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి నమోజు బాలాచారి, తెలంగాణ బిట్ బ్యాంక్ సంపాదకుడు తంగిరాల చక్రవర్తి, కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.