హైదరాబాద్/సిద్దిపేట, నవంబర్ 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీది చార్ సౌ బీస్ (420) మ్యానిఫెస్టో అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎట్లాగూ గెలిచేది లేదన్న ఉద్దేశంతో 42 పేజీల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని చెప్పారు. ప్రజలు ఎక్కడ కొడతారోనన్న భయంతోనే 24 గంటల కరెంటు ఇస్తామని మ్యానిఫెస్టోలో చేర్చారని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్షోలు నిర్వహించడంతోపాటు గజ్వేల్లో దివ్యాంగుల ఆత్మీయసమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఆర్నెళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు ఎందుకు గెలిపించామా? అని ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టేనని అక్కడి ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో రైతులకు కనీసం 3 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నదని, రైతుబంధు, కల్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ వంటి పథకాలను కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ను నమ్మిన పాపానికి ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు దిక్కు అవుతున్నాయి. అటువంటి స్థితే తిరిగి తెలంగాణలో రావాలా? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే సొంత గ్రామంలోనే తాగునీరు, సాగునీరు, కరెంటు కష్టాలతో ప్రజలు సతమతం అవుతున్నారు.
-మంత్రి హరీశ్రావు
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓట్ల కోసం ఝూటా మాటలు మాట్లాడుతున్నారని హరీశ్రావు మండి పడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ గొప్పోడు, మంచివాడు అని చెప్పిన ఈటల పార్టీ మారగానే మాట కూడా మార్చారని విమర్శించారు. అన్నం పెట్టిన కేసీఆర్ను మోసం చేసింది నువ్వు, సున్నం పెట్టింది నువ్వు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూత్ల్లోనే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎడాపెడా అప్పులు చేసిందని విమర్శిస్తున్న ఈటల రాజేందర్.. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు సంతకాలు పెట్టారని ప్రశ్నించారు. 3 గంటల కరెంటు, 10 హెచ్పీ మోటర్లు కావాలంటున్న రేవంత్రెడ్డికి వ్యవసాయం తెలవదన్నారు.
కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎలా ఉన్నదో.. ఇప్పుడు ఎలా ఉన్నదో ఆలోచించాలని హరీశ్రావు కోరారు. ఎవరో వచ్చి చెప్పే మాటలు నమ్మవద్దని, కండ్ల ముందు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరువు, కరెంటు కష్టాలు వస్తాయని పేర్కొన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలని, సీఎం కేసీఆర్ను నిండు మనసుతో దీవించాలని కోరారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. నీళ్లు, కరెంటు, దవాఖానలు తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. రోడ్లు వేసి అభివృద్ధి చేసింది కేసీఆర్ అని గుర్తుచేశారు. రోడ్లకు గతుకులు వస్తే రేపు డాంబర్ కూడా కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వేయరని ఎద్దేవా చేశారు. గజ్వేల్ దశ, దిశ మార్చింది కేసీఆర్ అని స్పష్టంచేశారు. నెత్తి మీద గంగమ్మ లెక కొండపోచమ్మసాగర్ తెచ్చింది కేసీఆర్ అని గజ్వేల్ ప్రజలు చెప్పుకుంటారని తెలిపారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తంచేశారు. గజ్వేల్లో సీఎం కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాహుల్గాంధీ ప్రకటిస్తున్న గ్యారెంటీలు ఎన్నికల గారడీలని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కర్ణాటకలో తాము ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాలా తీసిందని, ఆ పార్టీకి ఆర్థిక రంగంపై పట్టులేదని, మ్యానిఫెస్టో అమలుపై చిత్తశుద్ధిలేదని, సంపద సృష్టిపై ప్రణాళిక లేదని విమర్శించారు. ‘వెలుగు దీపావళి కావాలా? కర్ణాటకలోలాగా ఆర్థిక దివాళా కావాలా? అభివృద్ధిని పాతరేసి, సంక్షేమానికి సమాధి కట్టే కర్ణాటక మాడల్ కావాలా?’ ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలకు షరతులు పెట్టి మోసం చేస్తున్నదని, రేపు తెలంగాణలో అదే పరిస్థితి సృష్టించదనే గ్యారెంటీలేదని పేర్కొన్నారు. కొత్త స్కీమ్ల జాడలేదు కానీ పాత పథకాలకు కర్ణాటక కాంగ్రెస్ పాతరేస్తున్నదని విమర్శించారు. కర్ణాటకలో విద్యార్థుల స్కాలర్షిప్పుల్లో 80 నుంచి 85% కోతలతో వాతలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని మండిపడ్డారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పును రూ.60 వేల నుంచి రూ.11 వేలకు తగ్గించిందని చెప్పారు. పీజీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పును రూ.35 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారని, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ విద్యార్థులపై పెనుభారం మోపిందని విమర్శించారు. వంద రోజుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి కర్ణాటకలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించిన రాహుల్గాంధీ ఆర్నేళ్లు అయినా ఒక్క నోటిఫికేషన్ ఎందుకు విడదల చేయలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో యువశక్తిని ఈ సంవత్సరం పాస్ అయినవారికే ఇస్తామని, పాతవారికి ఇవ్వమని మెలికపెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో యువశక్తి పథకం ఒక్కరికీ అందించలేదని చెప్పారు.
శక్తి స్కీమ్లో శక్తి లేదు. గృహలక్ష్మి స్కీమ్లో లక్ష్మి లేదు. అన్నభాగ్య స్కీమ్లో బియ్యం లేవు. గృహజ్యోతి పథకంలో అంతా చీకట్లే. కర్ణాటకలో 5 గ్యాంరెటీలు చూసి ఓటేసిన ప్రజలకు అడుగడుగునా నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ను నమ్మి అవకాశం ఇచ్చిన కర్ణాటక ప్రజలకు నిత్యం నరకం చూపిస్తున్నారు.
-మంత్రి హరీశ్రావు
రాహుల్గాంధీకి దమ్ముంటే కర్ణాటక మాడల్తో ఓట్లు అడగాలని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. రాహుల్గాంధీ రాంగ్ గాంధీగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఫెయిల్యూర్ మాడల్ను మెడలో వేసుకొని వస్తే నమ్మేందుకు ఎవరూ లేరని చెప్పారు. కర్ణాటక వలె మోసపోయే సమాజం తెలంగాణ కాదనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కర్ణాటక ప్రజలను ఫెయిల్చేసిన రాహుల్ తెలంగాణ ప్రజల సంతోషాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఆర్నేళ్ల కాంగ్రెస్ పాలనలో 357 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీశ్రావు వివరించారు. మళ్లీ మనకు ఇటువంటి పరిస్థితి రావాల్నా? అని ఆలోచించాలని తెలంగాణ రైతాంగాన్ని కోరారు. కర్ణాటకలో అన్ని వర్గాల ప్రజలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారని వివరించారు. ఆర్నేళ్ల కింద కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేసిన కర్ణాటక ప్రజలు తలలు పట్టకుంటున్నారని, అటువంటి దుస్థితి తెలంగాణకు రాకూడదనే తమ తాపత్రయమని చెప్పారు. గెలిచే దాకా ఒక చాన్స్ ఇవ్వాలని అడిగి, గెలిచినంక ఎక్స్క్యూజ్మీ ప్లీజ్ అనే కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, తిరిగి కేసీఆర్కే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిది మేకపోతు గాంభీర్యమని మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. డిసెంబర్ 9న తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు ప్రకటించుకున్న నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. గత ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన వ్యక్తి ఇప్పుడు సీఎం అవుతానని ప్రకటించుకుంటే ఏమవుతుందో ప్రజలే తేల్చుతారని పేర్కొన్నారు. ఎవరెన్ని కలలు కన్నా రాష్ట్రంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆరే ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, కత్తి కార్తీక తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరచిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన చిదంబరంపై ఆయన నిప్పులు చెరిగారు. ‘కడుపులో చిచ్చుపెట్టి.. కండ్లు తుడవ వస్తరా’ అంటూ ప్రజాకవి కాళోజీ రాసిన కవితను గుర్తుచేస్తూ.. చిదంబరం వ్యవహారసరళి కూడా అట్లాగే ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరుల తల్లుల కడుపుకోతపై చిదంబరం కారం చల్లినట్టే ఉన్నదని విమర్శించారు. అమరుల తల్లులు శోకం కాంగ్రెస్కు శాపంగా మారుతుందని హెచ్చరించారు. జలియన్వాలాబాగ్లో వెయ్యి మందిని కాల్చిచంపిన డయ్యర్ క్షమాపణ చెప్తే ఎట్లా ఉంటుందో.. చిదంబరం సారీ చెప్పినా అట్లనే ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపినవారే సారీ చెప్పినట్టుగా చిదంబరం వ్యవహారం ఉన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ప్రజాకోర్టులో నిలబెట్టి అమరవీరుల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా తక్కువేనని పేర్కొన్నారు.
కర్ణాటకలో హామీ ఇచ్చిన రాహుల్గాంధీ రాంరాం చెప్పారు. ప్రచారంలో మభ్యపెట్టిన ప్రియాంకాగాంధీ పత్తాలేకుండా పోయారు. ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు రాహుల్, ప్రియాంక కర్ణాటకను వదిలి తెలంగాణ మీద పడ్డారు. ప్రచార సమయంలో కనిపించే నాయకులు కావాలా? నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకులు కావాలా? ప్రజలు ఆలోచించాలి.
-మంత్రి హరీశ్రావు
కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాహుల్గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం తెలంగాణభవన్లో మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి స్వాగతించారు. కత్తి కార్తీకకు సముచిత గౌరవం, మంచి భవిష్యత్ అందిస్తామని ఈ సందర్భంగా హరీశ్రావు హామీ ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో భర్తీ చేసిన ఉద్యోగాలు 13 వేలు మాత్రమే. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనతో దేశానికే నమూనాగా నిలిచింది. ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రైవేట్ రంగంలో 24 లక్షలు, ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది.
-మంత్రి హరీశ్రావు