Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు పంటలను చూసి ముగ్ధులయ్యారు. రైతులతో మాట్లాడి.. సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు.
మార్కెటింగ్ సమస్యలను, పంటకు సరైన ధర లేకపోవడంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర అందించాలన్నారు. రైతుల అవగాహన కోసం పంట వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి.. మార్కెట్ పరిస్థితుల గురించి ముందస్తు సమాచారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్లే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పారు. నిత్యం నీటి కొరతతో తిప్పలు పడే ఈ ప్రాంతాలు సాగునీటి సౌకర్యంతో పచ్చగా మారాయని.. ఇది కేసీఆర్ దూరదృష్టితోనే సాధ్యమైందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.