హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ లెక్చరర్లతోపాటు మినిమం టైం స్కేల్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వయసును పెంచారు. దీంతో ఇటీవల విరమణ పొందిన ఉద్యోగులను కూడా తిరిగి కొనసాగించనున్నారు. ఈ మేరకు ఇటీవలే ఇంటర్ విద్య అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని గతంలోనే 61 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే.
ఇది అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలైనా.. పలు కారణాలతో ఇంటర్ విద్యలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు అమలు కాలేదు. ఇటీవలే ఇంటర్ విద్య అధికారులు ఆర్థికశాఖ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపగా, అనుమతి వచ్చింది. దీంతో రాష్ట్రంలో 406 కాలేజీల్లో పనిచేస్తున్న 3,541 మంది లెక్చరర్లు, 103 మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్లు, 78 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు సంఘాల నేతలు జంగయ్య, రామకృష్ణగౌడ్, సురేశ్ సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, నర్సిరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డ్రాయింగ్ ఆఫీసర్లుగా ప్రిన్సిపాళ్లు
కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలను అందించేందుకు ఇది వరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు డ్రాయింగ్ ఆఫీసర్లుగా ఉండేవారు. ఆయా జిల్లాల్లోని ఏ ఒక్క కాలేజీ బిల్లులు సమర్పించకపోయినా ఆయా జిల్లాలోని లెక్చరర్ల వేతనాలు నిలిచిపోయేవి. దీనికి ముగింపు పలుకుతూ.. వేతనాలకు డ్రాయింగ్ ఆఫీసర్ బాధ్యతలను ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లకు అప్పగించారు. ఆధార్ బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.