హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 24: టీఆర్ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్లోని జక్కలొద్దిలో నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభ రికార్డు బద్ధలుకొట్టనున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. సభకు రాష్ట్రం నలువైపుల నుంచి 20 వేల బస్సు ల్లో 10 లక్షలకుపైగా ప్రజలు తరలిరానున్నట్టు తెలిపారు. ఆదివారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్లో కనీవినీ ఎరుగనిరీతిలో విజయగర్జన సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. వరంగల్లో 29న సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. త్వరలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. సమావేశంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, చీకటి ఆనంద్, పులి రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.