సిరిసిల్ల తెలంగాణ చౌక్/ ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 11; పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ లేదని నిరూపించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువతీ యువకులు. ఇటీవల వెలువడిన ఎస్ఐ ఫలితాల్లో లక్ష్యాన్ని చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలను సైతం భారీగా చేపట్టడంతో పోలీసు కావాలన్న ఎంతో మంది తమ కలలు సాకారం చేసుకున్నారు. వీరంతా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచే శారీరక పరీక్షలకు సిద్ధమవుతూనే రాత పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అనుకున్నదే తడువుగా అన్నింట్లోనూ విజయం సాధించి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇందులో అత్యధికులు నిరుపేదలే ఉన్నారు. పేదరికం వెంటాడినా తాము అనుకున్న లక్ష్యం కోసం అహర్నిశలూ శ్రమించి ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో సత్తాచాటారు.
నిరుపేద కుటుంబాలు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. బాల్యం నుంచే అమ్మానాన్నల కష్టాన్ని కండ్లారా చూసి పెరిగిన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పించారు. చదువే లోకంగా కష్టపడి ఎస్ఐ కొలువులు కొల్లగొట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఏడుగురు పేదింటి విద్యా కుసుమాలు తాజాగా విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో సత్తాచాటి, కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు.
లైబ్రరీలో చదివి.. జాబ్ సాధించి
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్కు చెందిన రేనిగుంట మహేందర్, మమత దంపతులది నిరుపేద నేతన్న కుటుంబం. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. తల్లి మమత బీడీలు చుడుతూ, మహేందర్ సాంచెల పని చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు. పెద్ద కొడుకు సాయి బీటెక్ పూర్తి చేసి, ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పోటీపరీక్షలకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ యవకుడు ఎలాగైనా జాబ్ సాధించాలని అనుకున్నాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే సొంతంగానే ప్రిపేరయ్యాడు. ప్రతి రోజూ జిల్లా కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో 16 నుంచి 18గంటల దాకా చదివాడు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎస్ఐ, డీఏవో, గ్రూప్-4 గ్రూప్-1 ఫ్రిలిమినరీలో పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో కొలువు కొల్లగొట్టాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా జోన్-3లో టాప్-2 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచాడు.
తల్లిదండ్రుల కష్టాన్నిచూడలేక కొలువు..
గొల్లపల్లికి చెందిన అందె సత్తయ్య-నర్సవ్వకు ఇద్దరు కూతుళ్లు, ఒక్క కొడుకు సతీశ్ ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ 30 ఏండ్లుగా గొల్లపల్లి బస్టాండులో కూరగాయలు అమ్ము తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చి నా కొడుకును జ్ఞానదీప్ పాఠశాలలో చదివించారు. అనంతరం డిప్లమా, బీటెక్ హైదరాబాద్లో చేయించారు. ఈ క్రమంలో సతీశ్ హైదరాబాద్లోనే ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో సత్తాచాటడంతో సత్తయ్య, నర్సవ్వల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.
నాన్న మెకానిక్.. కొడుకు ఎస్ఐ
గొల్లపల్లికి చెందిన పిట్ల దీపక్ది పేద కుటుంబం. తల్లిదండ్రులు శ్రీశైలం-లక్ష్మి. నాన్న టీవీ, రేడియో మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే దీపక్ బాల్యం నుంచే చదువులో చురుగ్గా ఉండడంతో బాగా చదివించాడు. ఈ క్రమంలో గొల్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి దాకా చదివిన దీపక్ ఉత్తమ ప్రతిభ చూపి, టీటీడీ స్కాలర్ షిప్కు ఎంపికయ్యాడు. డీఆర్డీఏ ద్వారా హైదరాబాద్లోని నారాయణ కాలేజీలో ఇంటర్లో ఫ్రీ సీట్ సాధించాడు. అక్కడా ఉత్తమ ప్రతిభ చూపి మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీలో ఫీ సీట్ పట్టేశాడు. 2017లో కానిస్టేబుల్ పోటీ పరీక్షలో సత్తా చూపి ఏఆర్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. విధులు నిర్వర్తిస్తూ ఎస్ఐ పరీక్ష రాసి, ఫలితాల్లో సత్తాచాటగా, తల్లిదండ్రులు సంబురపడుతున్నారు.
ఇద్దరు యువకులకు సన్మానం
గొల్లపల్లికి చెందిన అందె సతీశ్, పిట్ల దీపక్ ఎస్ఐ ఉద్యోగాలు సాధించగా, గ్రామంలోని అంబేద్కర్ సంఘం సభ్యులు, లయన్స్క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇద్దరికి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. అంతకు ముందు సతీశ్, దీపక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు
తండ్రి మేస్త్రీ.. బిడ్డ ఎస్ఐ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండకు చెందిన మౌటం మానస సివిల్ ఎస్ఐ కొలువు సాధించింది. తల్లిదండ్రులు సారయ్య-సారమ్మ. తండ్రి మేస్త్రీ పని చేస్తూ, తల్లి కూలీ పనికి వెళ్తూ బిడ్డను చదివించారు. మానస ప్రాథమిక విద్యాభ్యాసం పోత్కపల్లిలోని సర్కార్ బడిలో చదువగా, ఇంటర్ ఓదెలలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది. హన్మకొండలోని ప్రభుత్వ సీటీఈలో బీఈడీ చేసింది. తాజాగా విడుదలైన ఫలితాల్లో సివిల్ ఎస్ఐగా ఎంపికైంది. ప్రభుత్వ పాఠశాలలో చదివి తల్లిదండ్రుల కలను సాకారం చేసిన మానసను ప్రిన్సిపాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి కల్పన, ఉపన్యాసకులు అభినందించారు.
తొలి ప్రయత్నంలో ఉద్యోగం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన సామల్ల శ్రావణి ఎస్ఐ కొలువు సాధించింది. శ్రావణి తండ్రి రమేశ్ చికెన్ సెంటర్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతుండగా, తల్లి రాజగంగుల బీడీ కార్మికురాలు. శ్రావణి ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే పూర్తి చేయగా, ఇంటర్ కరీంనగర్ ట్రినీటి కాలేజీలో చదివింది. హైదరాబాద్ కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ, వరంగల్ కేయూలో పీజీ పూర్తి చేసింది. బాల్యం నుంచే చదువులో ముందుండే శ్రావణి, తొలి ప్రయత్నంలోనే ఎస్ఐకి ఎంపిక కావడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
పీసీ టూ సీఐడీ ఏఎస్ఐ
2013 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ కిరణ్ జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సైబర్ విభాగంలో పనిచేస్తున్నాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు జిల్లా కేంద్రంలోని స్పెక్ట్రమ్ స్టడీ హాల్లో ఉద్యోగానికి సన్నద్ధమై ఫింగర్ ప్రింట్ బ్యూరో(సీఐడీ విభాగం)లో ఏఎస్ఐ ఉద్యోగం సాధించాడు. ఎస్ఐ కావాలన్న ఎన్నో ఏండ్ల కోరిక నేడు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని కిరణ్ చెబుతున్నాడు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి..
గోదావరిఖనిలోని సంజయ్ గాంధీ నగర్లో నివసించే నిరుపేద కుటుంబానికి చెందిన ఏలూరి లింగారెడ్డి నాలుగో కుమార్తె ఏలూరి రవళి సివిల్లో కాళేశ్వరం జోన్ ఎస్ఐగా ఎంపికైంది. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో శుభ కార్యాలకు వంటలు వండుతూ లింగారెడ్డి, వసంత జీవనం కొనసాగిస్తున్నారు. రవళికి వివాహం జరిగినా కష్టపడి చదివింది. తాను ఈ ఉద్యోగం సాధించడానికి తన భర్త శ్రీధర్రెడ్డి సహకారం ఎంతో ఉందని రవళి చెబుతోంది.
పేదింట మెరిసిన యువకుడు
కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మేడిద సాయికృష్ణది పేద కుటుంబం. తల్లిదండ్రులు మధు-సంగీత వ్యవసాయం చేస్తుంటారు. తండ్రి 2004 లో అనారోగ్యంతో చనిపోగా, తల్లి కష్టపడి కొడుకును చదివించింది. ఈ క్రమంలో ప్రాథమిక విద్యాభ్యాసం గంగారంలో పూర్తిచేసిన సాయికృష్ణ, పదో తరగతి జమ్మికుంటలో, ఇంటర్ కరీంనగర్ ట్రినిటీలో పూర్తిచేశాడు. ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో వరంగల్లోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. మొదటి నుంచి పోలీస్ కావాలని కలలు గన్న సాయి, రెండేళ్లు హైదరాబాద్లో ఉంటూ ఎస్ఐ ఉద్యోగానికి కోచింగ్ తీసుకున్నాడు. తాజాగా విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు.
సమాజ సేవే లక్ష్యం..
మాది పేద కుటుంబం. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మే అన్నీ తానై వ్యవసాయంతోపాటు కూలీ పనిచేసి నన్ను, చెల్లెను చదివించింది. కొద్దిరోజుల క్రితమే చెల్లెలికి వివాహం చేశాం. సమాజానికి సేవే లక్ష్యంగా ఎస్ఐ ఉద్యోగాన్ని ఎంచుకున్న. కష్టపడి చదివా. రెండ్రోజుల క్రితం వచ్చిన ఫలితాల్లో సివిల్ ఎస్ఐగా ఎంపికకావడం సంతోషంగా ఉంది.
– సాయికృష్ణ, సివిల్ ఎస్ఐ